*ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..తక్కువ వడ్డీకే లోన్స్!*
ప్రస్తుతం ఉన్న క్లిష్టపరిస్థితుల్లో డబ్బు అత్యవసరంగా మారింది. దీనికి తోడు రుణాలిచ్చే కొన్నిసంస్థలూ తాత్కాలికంగా రుణాల మంజూరు నిలిపివేశాయి. అందులోనూ కరోనా మహమ్మారి తెచ్చిన తిప్పలతో సంస్థలు కూడా ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరటనిచ్చే వార్త చెప్పింది. తమ వినియోగదారులకు సత్వరం లోన్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. బ్యాంకులకు వెళ్లే పనిలేకుండా ఇంట్లో కూర్చుని లోన్ పొందే సదుపాయం ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ అత్యవసర లోన్లు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ (పీఏపీఎల్) లోన్లుగా పేర్కొంది.
తక్కువ వడ్డీకే అంటే 7.25 శాతం వడ్డీకే కేవలం 45 నిమిషాల్లో లోన్ పొందవచ్చని తెలుపుతూ ఇటీవలే ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు లోన్ వాయిదాలు వెంటనే ప్రారంభంకావు. ఆరు నెలల తర్వాత నుంచి కట్టాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి...
ఎస్బీఐ సీనియర్ ఉద్యోగి రాజేంద్ర అవస్తి ఈ విషయమై వివరాలు తెలియజేశారు. ఎస్బీఐ వినియోగదారులు తమకు లోన్ ఎలిజిబులిటీ ఉందో లేదో తెలుసుకునేందుకు తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 567676 నంబరుకు PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తమ అకౌంట్ నంబరులోని చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేసి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. తరువాత ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పొందేందుకు అర్హత ఉందీ లేనిదీ తెలుపుతూ మెసేజ్ వచ్చేస్తుంది. ఆ తరువాత ఎస్బీఐ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకుని లోన్ పొందవచ్చు. నిరంతరం ఈ సదుపాయం అందుబాటులోనే ఉంటుందని ఆయన తెలిపారు.
ఇలా సులభంగా లోన్ పొందండి...
1. స్టేట్ బ్యాంక్ యోనో యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి.
2.యాప్ ఓపెన్ చేయండి.
3. కాల వ్యవధి, ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకొని, వివరాలు నమోదు చేయండి.
4. రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి, క్లిక్ చేయండి. అంతే నగదు మీ ఖాతాలో నిర్ణీత సమయంలో జమవుతుంది.