వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' ప్రారంభించిన సీఎం జగన్‌

*అమరావతి:*


*24-04-2020*


*'వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' ప్రారంభించిన సీఎం జగన్‌*


◆పొదుపు సంఘాలకు రూ.1400కోట్లు జమ చేసిన ప్రభుత్వం..


ఏపీలో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ అందించే 'వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏప్రిల్‌ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1400 కోట్ల వడ్డీ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జమ చేశారు. ఈ పథకం ద్వారా 8.78 లక్షల పొదుపు సంఘాల్లో ఒకేసారి రూ.1400 కోట్ల వడ్డీని జమచేశామని.. దీంతో సుమారు 91 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ మాట్లాడారు.
కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ మహిళలకు అండగా నిలబడాలనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. మొట్టమొదటిసారిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ రుణాలు తెచ్చారని.. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారిందని సీఎం గుర్తు చేశారు. 2016లో సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారని విమర్శించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాని పరిస్థితి నెలకొందని.. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కచెల్లెళ్ల కోసం ఈ పథకం తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా ప్రతి గ్రూపునకు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకంతో ఏటా ఆ మేరకు లబ్ధి పొందుతారని.. దీని వల్ల పొదుపు సంఘాలకు మరింత మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కరోనా ప్రభావం లేకుంటే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ అయ్యేవని.. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా జులై 8న 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాకుండా ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు.