ఘనంగా పునరుత్థాన పండుగ ప్రార్ధనలు


 ఘనంగా పునరుత్థాన పండుగ ప్రార్ధనలు




 


- శిలువను గెలిచిన రక్షకునికి ఆరాధనలు 



తెనాలి ఏప్రిల్ 4 (తెనాలి): పట్టణ,పరిసర గ్రామాల్లో అన్ని క్రీస్తు దేవాలయాల్లో క్రీస్తు పునరుత్థాన పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఆయా చర్చీలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.తెల్లవారు జామునుంచే క్రైస్తవ సోదరులు సంప్రదాయబద్ధంగా క్రైస్తవ స్మశాన వాటికలకు చేరుకుని పూర్వికుల సమాధులపై పువ్వులు చల్లి, క్యాండిల్స్ వెలిగించి మృతిచెందిన వారిని స్మరించుకున్నారు.స్థానిక ఐతానగర్,చినరావూరు, రామలింగేశ్వర పేట,పినపాడు తదితర స్మశాన వాటికల్లో ప్రార్ధనలు జరిపారు. వీటితోపాటు తెనాలి నియోజకవర్గంలోని అన్ని క్రైస్తవ స్మశానవాటికల్లో ప్రార్ధనలు జరిగాయి.బోస్ రోడ్ లోని ఎఇఎల్ సి క్రీస్తు దేవాలయం (టౌన్ చర్చి)లో ఉదయం తొమ్మిది గంటలనుంచి పునరుత్థాన పండుగ పవిత్ర ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. చర్చి పాస్టర్లు రెవ.డి.యేసురత్నం,వై. లెనిన్ బాబు,డి. సాల్మన్‌రాజు, యం.వి.బి ప్రకాష్ బాబులు ఈస్టర్ పండుగ ప్రత్యేక వాక్యపఠనం చేసి పాపులను రక్షించుటకు క్రీస్తు శిలువ మరణంపొంది సజీవునిగా మూడవ రోజు తిరిగిలేచాడని ప్రవచించారు. మానవాళి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన క్రీస్తు బోధనలు ఆచరణీయం అన్నారు. ప్రేమ,దయ,శాంతి, క్షమలను తెలియజేసిన క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. స్త్రీల సమాజం సభ్యులు, సండే స్కూల్ పిల్లలు, యూత్ సభ్యులు ప్రత్యేక గీతాలను ఆలపించారు.చర్చి అడహక్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.ప్రార్ధనల అనంతం భక్తులకు పలహారాలను పంపిణీ చేసారు. టౌన్ చర్చితో పాటు ఐతానగర్, చెంచుపేట, హయ్యర్ పేట, కొత్తపేట, మారీసుపేట, ముత్తెంశెట్టిపాలెం, చినరావూరు, చినరావూరుతోట, అమరావతి ప్లాట్స్, నందులపేట తదితర ప్రాంతాల్లోని లూధరన్, ఆర్ సిఎం, బాప్టిస్టు, రక్షణ సైన్యం తదితర చర్చీల్లో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు.