తెనాలి నుండి చిత్ర సీమలోకి అడుగు పెట్టిన తొలితరం తార కాంచనమాల సినీ ప్రయాణం..

తెనాలి నుండి చిత్ర సీమలో కి అడుగు పెట్టిన తొలితరం తార  కాంచనమాల గారి సినీ ప్రయాణం:

కాంచనమాల (మార్చి 5, 1917 - జనవరి 24, 1981) తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఈవిడా ఒకరు.కాంచనమాల తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుణ్ణి ప్రేమించి పెళ్ళాడారు.

చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై.వి.రావు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారము (35) లో మిత్రవింద వేషం వేయించారు. ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యు (1936) లోనే ఆమె కథానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా విప్రనారయణ (1937), మాలపిల్ల (1938), వందేమాతరం (1939),మళ్ళీ పెళ్ళి (1939), ఇల్లాలు (1940), మైరావణ (1940), బాలనాగమ్మ (1942) వంటి సినిమాలలో కథానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి (1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది.

#మాలపిల్ల 

ఆ తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి, మాల పిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్ళి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా అభినందనీయం. ఆ సినిమా రెండవభాగంలో ఆమె విద్యావంతురాలిగా కన్పిస్తారు. ఒక సీన్లో ఆమె స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో కాలెండర్ల మీద అచ్చయింది. అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా వెలుగొందారు ఆమె. అప్పట్లోనే కాంచన మాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి.ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వాంఫ్ రోల్ ధరించిన ఈమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు. అది నాగయ్యగారి రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్యగారు, కాంచనమాల గారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు.ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీపెళ్ళి వితంతు వివాహాన్ని ప్రబోధించు చిత్రం. ఈ చిత్రంలో ఆమె వితంతువుగా కూడా అందంగా ఉన్నారని అందరూ చెప్పుకునేవారట.

ఆమె నటించిన ఇల్లాలు సినిమా విడుదల అయి మునుపటి సినిమాలంత విజయం సాధించలేకపోయినా ఆంధ్రపత్రిక ఫిలింబ్యాలెట్ లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు. ఆ సమయంలో విడుదల ఐన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపొయింది. ఆ తర్వాత జెమినీ వాసన్ గారి నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచన మాల అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికే ఊంఫ్ గరల్, ఆంధ్రా గ్రేటా గార్భో అని పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. కానీ అగ్రిమెంట్ వలన ఆమె ఆ చిత్రాలలో నటించడానికి వీలు లేక పోయింది. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదు అని చెప్పడంతో మాట మాట పెరిగి "నీ దిక్కున్న చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడవి ఐతే నా కేంటి? "అని అన్నారు కాంచనమాల. ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. ఈ సమయం లోనే బాల నాగమ్మ విడుదల అయి అఖండ విజయం సాధించింది. దాని వలన వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్ కు వున్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచన మాల నటనకు ఈ సినిమా గీటురాయి. కానీ ఆ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రం అయినది. ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న ఆమె కళ్లు ఆ షాక్ తో శూన్యం లోనికి చూడటం మొదలుపెట్టాయి. హిందీ చిత్ర సీమలో అవకాశాలు వచ్చిన తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇలా జరగడం అత్యంత విచారకరం. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలన చిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది. ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య గారు క్షయ వ్యాధి తో మరణించారు. దాంతో ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

1940 లో ఆంధ్రా పారిస్ గా పేరు గాంచిన ఆమె స్వంత ఊరు తెనాలిలో "శాంతి భవనం" అనె ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నరు కాంచనమాల. ఆమె ఆ ఇంట్లో నివసించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. నటనలో ఆమె నుండి స్ఫూర్తి పొందిన వారిలో జి.వరలక్ష్మి ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి గారు తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయా చిత్రాన్ని సెట్ లో ఉంచారు. వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆమె 10000/- పారితోషికంగా తీసుకునేవారు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందినా ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదుట. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాల గారిపై 2 సార్లు కవితలల్లారు.కాంచన మాల గారు 1981 జనవరి 24 న మద్రాసులో ఈ లోకాన్ని వదిలి పరలోకాన్ని చేరారు.

*కాంచనమాల గారు నటించిన పలుచిత్రాలు* :-
నర్తనశాల (1963)
లవ్ మ్యారేజి (హింది) (1959)
జింబొ (హింది) (1958)
బాల నాగమ్మ (1942)
ఇల్లాలు (1940)
మళ్ళీ పెళ్ళి (1939)
వందేమాతరం (1939)
గృహలక్ష్మి (1938 సినిమా)
మాలపిల్ల (1938)
విప్రనారాయణ (1936)
వీరాభిమన్యు (1936 సినిమా)
కృష్ణ తులాభారం (1935)