కట్టెలు కొట్టిన చేతులు ఒలంపిక్ మెడల్ అందుకున్నాయి

కట్టెలు కొట్టిన చేతులు… ఒలంపిక్ మెడల్ అందుకున్నాయి
చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
ఒలంపిక్స్! వాటిలో పాల్గొనడమే ఓ అద్భుతమైన విజయం. అలాంటిది పతకం దక్కించుకోవడం ఇంకెంత గర్వకారణమో కదా. ఆ సమయంలో జాతీయ గీతం మోగుతూ ఉంటే, ఒంటికి చుట్టుకున్న జెండా రెపరెపలాడుతుంటే… అంతకంటే గొప్ప ఉద్వేగాన్ని ఊహించగలమా! వంద కోట్లమంది భారతీయులు తల ఎత్తుకునే మన విజయాన్ని దేనితో అయినా పోల్చగలమా! అందుకే ఇవాళ మీరాబాయి సృష్టించిన చరిత్ర మనలో ప్రతి ఒక్కరికీ గర్వకారణం. ఆ ప్రస్థానం వెనుక ఉన్న ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకం.
1994 ఆగస్టు 8న మణిపుర్ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు మీరాబాయి. తనది దిగువ మధ్యతరగతి కుటుంబం. కష్టపడి తీరాల్సిన బాల్యం. రోజూ కట్టెలు కొట్టుకుని వస్తే కానీ పొయ్యి వెలగదు. ఖాళీ డబ్బాలతో చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకుంటే కానీ దాహం తీరదు. మీరాబాయి తన అన్నతో కలిసి ఆ పనులు చేసేది.
మీరాబాయికి మొదటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. కాకపోతే వాటిలో కొట్లాటలు, బట్టలు మురికి చేసుకోవడం తనకు నచ్చేది కాదు. కాస్త హుందాగా కనిపించే ఆటలు ఆడాలనుకుంది. అలా వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకుంది. కానీ ఆటలో పట్టు అంత తేలికగా చిక్కలేదు. తన ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉన్న శిక్షణా కేంద్రానికి ఉదయం ఆరుగంటలకల్లా చేరుకోవాలి. ఆ కాస్త దూరానికీ రెండు బస్సులు మారాలి. చదువు కూడా కొనసాగించాలి. తన వెయిట్ లిఫ్టింగ్ లాగానే ఈ కష్టాలన్నింటినీ ఎత్తి అవతల పడేసింది. మీరాబాయి. ఒకో అడుగూ ముందుకు వేస్తూ జాతీయ స్థాయిలో రాణించడం మొదలుపెట్టింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని మెడల్స్ సంపాదించినా, రికార్డులు సృష్టించిన మీరాబాయి 2016 ఒలంపిక్స్ లో మెడల్ తెస్తుందనే అనుకున్నారు అందరూ. కానీ మీరాబాయి అక్కడ దారుణంగా విఫలం అయింది. విమర్శకుల నోళ్లకు పనిపడింది. అయినా నిరాశ చెందలేదు మీరా. తన శిక్షణ కొనసాగిస్తూ, పాల్గొన్న ప్రతి పోటీలోనూ రాణిస్తూ మరో అవకాశం కోసం కాచుకుని ఉంది. టోక్యో ఒలంపిక్స్ లో అడుగుపెట్టీ పెట్టగానే… వెండి పతకం సాధించింది. 49 కిలోల విభాగంలో 202 కిలోల బరువు ఎత్తిపడేసి మెడల్ అందుకుంది.
వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశం అందుకున్న తొలి వెండి మెడల్ ఇది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలంపిక్ మెడల్ సాధించిన రెండో వ్యక్తి మీరానే. తన విజయ యాత్ర ఇప్పుడే మొదలైంది. మార్గంలో మరెన్నో మజిలీలు, సంచలన వార్తలుగా మారబోతున్నాయి.


.