284 మంది విజ్ఞాన్స్ లారా విద్యార్థుకు ఉద్యోగాలు
179 మంది విద్యార్థులు విప్రో సంస్థకు ఎంపిక
105 మంది యాక్సించ్యూర్ కంపెనీకు ఎంపిక
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ లారా ఇంజినీరింగ్ కళాశాలలోని∙నాలుగో సంవత్సరానికి చెందిన 284 మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలైన విప్రో, యాక్సించ్యూర్ వంటి బహుళజాతి కంపెనీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్స్ లారా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్రకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫణీంద్రకుమార్ మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన 284 మంది విద్యార్థులు రూ.3.75 లక్షల వార్షిక వేతనం నుంచి రూ.7 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులలో సీఎస్ఈ విభాగం నుంచి 118 మంది, ఈసీఈ విభాగం నుంచి 101 మంది, ఐటీ విభాగం నుంచి 31 మంది, ఈఈఈ విభాగం నుంచి 21 మంది, మెకానికల్ విభాగం నుంచి 10 మంది, సివిల్ విభాగం నుంచి 3 గురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, మాజీ డీజీపీ ఎం.మాలకొండయ్య, డాక్టర్ వై.శరత్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎన్.శ్రీకాంత్, మాజీ సీఈవో కే.పవన్ క్రిష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులను బలవంతంగా, బాధతో చదివించడం కాకుండా.... విద్యార్థులే స్వతహాగా చదువుకునే విధంగా ప్రోత్సాహించటం, ఆలోచన కలిగించటం, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే అభిరుచిని కలగజేస్తామన్నారు. కళాశాలలో అత్యుత్తమ అధ్యాపకులను నియమించడమే కాక, చదువులోనూ, ఇతర అంశాలలోనూ సరిగా తీర్చిదిద్దే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం మా కళాశాల ప్రత్యేకతని చెప్పుకొచ్చారు. ఉద్యోగాల కోసం సాధారణ శిక్షణతో పాటు, ప్రతి కంపెనీకి కావలసిన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని... వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో చాలా మంది ఎంసెట్లో అర్హత కూడా సాధించలేదని, ఇంటర్మీ డియట్లో సాధారణ మార్కులు సాధించిన వారికి అత్యుత్తమ ఉద్యోగాలు ఇప్పించగలిగామని వెల్లడించారు. తమ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ విద్యతో పాటు ప్రత్యేక తరగతులు, మేము అవలంభించే కౌన్సిలింగ్ సిస్టం విధానం, ప్రత్యేక ట్రైనింగ్ క్లాస్లే కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్ర కుమార్, ఉపాధి కల్పనాధికారులు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.