షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జెడ్పి చైర్ పర్సన్ హెని క్రిస్టినా కు ఘన సత్కారం

తెనాలి :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తారని అందుకు ఉదాహరణ హెనీ క్రిస్టినా కు దక్కిన జడ్పీ పదవి అని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జెడ్పి చైర్ పర్సన్ హెని క్రిస్టినా కు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ఐక్యవేదిక నాయకుడు గుంటూరు కృష్ణ అధ్యక్షత వహించారు.హోం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన క్రిస్టినా సురేష్ దంపతులకు రెండోసారి సీటు రాకపోయినా నిరాశ చెందలేదని జగన్ మాట విన్నందుకు వారికి మంచి ప్రతిఫలం దక్కిందని అన్నారు. ఆయన నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని చెప్పారు.తన రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ గా ప్రారంభమైందని ఫిరంగిపురం జడ్పిటిసిగా ఉన్నప్పుడు హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వాహకులైన సురేష్ దంపతులను ఆరు బోర్లు కావాలి అని అడిగానని వెంటనే వారు స్పందించి వాటిని వేయించాలని అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా నీళ్లు పడలేదని అయితే ఈ ఆరు బోర్లలో నీళ్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్కూళ్లలో  అడిగిన వారికి అడ్మిషన్ లేదనకుండా ఇచ్చారని ఇది వారి మంచితనానికి నిదర్శనమని అన్నారు. ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ మంచికి మంచి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవ ఉండదని తెలిపారు. తెనాలి, వేమూరు ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జున మాట్లాడుతూ సహనం, ఓర్పుకు, మంచితనానికి నిదర్శనం క్రిస్టినా దంపతులని పేర్కొన్నారు. వారు జగన్ మాట విన బట్టి వారికి మంచి జరిగిందని,తెనాలి ప్రాంతం వారికి అత్యున్నత పదవి లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతం నుండి గతంలో అనేకమంది ఎన్నికయ్యారని వారి కంటే మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ క్రిస్టీనాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మోపిదేవి వెంకటరమణ, మునిసిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీం,వైసీపీ రాష్ట్ర నాయకులు కత్తెర సురేష్ కుమార్,ఎంపిపి చెన్నుబోయిన శ్రీనివాసరావు, జడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి,కోడూరు స్వప్న తదితర వైసీపీ నాయకులు హాజరయ్యారు.