తైక్వాండోలో విజ్ఞాన్స్ విద్యార్థులకు 3 స్వర్ణాలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ అమేట్యూర్ తైక్వాండో అసోసియేషన్ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన రెండో ఇంటర్ స్టేట్ తైక్వాండో చాంపియన్షిప్స్–2021లో 3 స్వర్ణపతకాలు, ఒక కాంస్య పతకం లభించాయని ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం బయోటెక్నాలజీకు చెందిన టీ.జస్వంతి (అండర్ 53 కిలోల విభాగంలో), సెకండ్ బీసీఏకు చెందిన ఎస్కే అస్విల్ అహ్మద్ ( అండర్ 68 కిలోల విభాగంలో), బీబీఏ రెండో సంవత్సరానికి చెందిన షేక్ రఫీలు ( అండర్ 80 కిలోల విభాగంలో) స్వర్ణ పతకాలు సాధించారని, మూడో సంవత్సరం బీఫార్మసీకు చెందిన ప్రసంజీత్ కుమార్కు 68 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు. రెండో ఇంటర్ స్టేట్ తైక్వాండో చాంపియన్షిప్స్–2021లో మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన 500 మంది విద్యార్థులు పాల్గొనగా తమ యూనివర్సిటీకు చెందిన 4గురు విద్యార్థులకు పతకాలు రావడం చాలా గర్వకారణమన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అభినందించారు.