జాతీయస్థాయిలో మెరిసిన విజ్ఞాన్స్ విద్యార్థిని
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు చెందిన కుందేటి యామినికి ఎంహెచ్ఆర్డీ ( మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్)కు చెందిన అనుబంధ సంస్థ ఉన్నత భారత అభియాన్ నిర్వహించిన జాతీయ స్థాయి ఆన్లైన్ వీడియో కాంపిటీషన్ పోటీలలో తృతీయ బహుమతి లభించిందని ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం ఫుడ్ టెక్నాలజీ విభాగానికి చెందిన కుందేటి యామిని అనే విద్యార్థిని ఉన్నత భారత అభియాన్ నిర్వహించిన కోవిడ్–19 అవగాహనకు చెందిన ‘‘ ఫోకసింగ్ ఆన్ అవేర్నెస్ థాటౌట్ ద పాండమిక్’’ అనే అంశంపై నిర్వహించిన వీడియో కాంపిటీషన్ పోటీలలో జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి లభించిందన్నారు. జాతీయస్థాయిలో జరిగిన ఈ పోటీలలో దాదాపు 750 కాలేజీలు, యూనివర్సిటీల నుంచి విద్యార్థులు పాల్గొనగా, తమ వర్సిటీకు చెందిన విద్యార్థిని ఉత్తమ ప్రతిభ చూపి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందుకుందని వెల్లడించారు. జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన యామినిని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.