విద్యార్థికి లెర్నింగ్ నిరంతర ప్రక్రియ
ఐఐఐటీ అలహాబాద్ డైరక్టర్, ప్రొఫెసర్ పీ.నాగభూషన్
ఎన్ఈపీ–2020పై విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ప్రత్యేక ఉపన్యాసం
విద్యార్థికి లెర్నింగ్, ట్యూటోరియల్ సెషన్, ప్రాక్టిస్/ ప్రాక్టికల్ అనే మూడు అంశాలు నిరంతర ప్రక్రియలని ఐఐఐటీ అలహాబాద్ డైరక్టర్, ప్రొఫెసర్ పీ.నాగభూషన్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘‘ ట్రాన్స్ఫార్మింగ్ పాలసీ ఎన్ఈపీ–2020 ఇన్టు ప్రాగ్మాటిక్ రియాలిటీ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ టెక్నికల్’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐఐటీ అలహాబాద్ డైరక్టర్, ప్రొఫెసర్ పీ.నాగభూషన్ మాట్లాడుతూ అధ్యాపకుడు విద్యార్థికి ప్రశ్న– జవాబు అనే విధానంలో బోధించకుండా వాటిని అర్థం చేసుకునే విధంగా బోధించాలన్నారు. విద్యార్థులు తమకున్న 24 గంటల సమయంలో కేవలం 8 గంటల సమయాన్ని లెర్నింగ్కు కేటాయించినట్లైతే అధ్బుతాలు సృష్టించవచ్చునన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియజేయాలన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను వీలైనంతవరకు ప్రాక్టికల్గా చెప్పడానికి ప్రయత్నిస్తే వారికి సులువుగా అర్థమవుతుందన్నారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ఎన్ఈపీ–2020 గురించి మాట్లాడుతూ యూపీపీఎస్సీ, ఐబీపీఎస్, ఫారెస్ట్ సర్వీస్, ఇంజినీరింగ్ సర్వీస్లాగే అధ్యాపకులకు ప్రత్యేకమైన సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసి ఎంపిక చేసుకునే విధంగా రూపొందించి ఉంటే బాగుండేదన్నారు.