విజ్ఞాన్స్ వర్సిటీ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ దత్తగ్రామమైన వడ్లమూడి, గుంటూరు పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డేజ్ హోమ్లో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించామని వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలోని పార్థ డెంటల్ క్లినిక్ వారి సహకారంతో వడ్లమూడి గ్రామంలోని 269 మందికి డాక్టర్ ఎండీ. మహమ్మద్ సోహెల్ ఆధ్వర్యంలో ఉచితంగా డెంటల్ చెకప్ను నిర్వహించామన్నారు. అంతేకాకుండా అవసరమైన వారికి మందులు, మౌత్ వాష్లను కూడా అందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ ఆధ్వర్యంలో గుంటూరులోని పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డేజ్ హోమ్కు దుప్పట్లు అందజేసారు. కార్యక్రమంలో వడ్లమూడి గ్రామపంచాయతీ సర్పంచ్ అనితారాణి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ విద్యార్థులు పాల్గొన్నారు.