వినరా భారత వీరకుమారా విజయగాథ నేడు

బుర్రకథా కళాకారుడు : షేక్ నాజర్
వినరా భారత వీరకుమారా విజయగాథ నేడు, తందాన తాన.
బుర్రకథ అనే మాట వినగానే మన కందరికీ గుర్తువచ్చే మొదటి పేరు షేక్ నాజర్. ఆంగ్లేయుల పాలనాకాలంలో, గుంటూరుజిల్లా పొన్నేకల్లు గ్రామంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబములో షేక్ నాజర్ జన్మించేరు. షేక్ నాజర్ తండ్రిగారు తన కుటుంబములో నెలకొనియున్న దుర్భర ఆర్థిక పరిస్థితులను సహితము లెక్కచేయకుండా, తన పుత్రుడు మున్ముందు గొప్ప పేరుప్రఖ్యాతులు గడించాలనే గంపెడు ఆశతో షేక్ నాజర్‍ను పొన్నేకల్లులోని ప్రాథమిక పాఠశాలకు పంపించేరు. తనకుగల చిన్న పొలమునుండి వచ్చే అతితక్కువ రాబడికి తోడుగా సన్నాయి వాయిద్యముద్వారా సంపాదించినదానిలో అధిక మొత్తాన్ని కొడుకు చదువుకే వెచ్చించేవారు.
ఆ పాఠశాలకు వచ్చిన ఒక స్కూల్‍ఇన్పెక్టర్ నాజర్‍లోని కళని గుర్తించి కొన్ని నాటకాలలో నటించే అవకాశం కల్పించేరు. ఆ నాటకాలలో హార్మోనియం వాయించే ఒక కళాకారుడు నాజర్‍ని బాలరత్న సభ అనే నాట్యమండలిలో చేర్చడంతో నాజర్‍కు రంగస్థల కళాకారుడు అవడానికి వీలు చిక్కింది. తొలుతగా నాజర్ అంత పిన్న వయసులోనే సంత్ కబీర్ దాస్ పాత్రను అద్భుతంగా పోషించేడు. ఆ నాట్య మండలి నెలకు ఇచ్చే పదిహేను రూపాయల పారితోషికము ఏమాత్రము చాలకున్ననూ, నాజర్ కర్నాటక సంగీతాన్ని నేర్చుకోవడం మానలేదు. కానీ అదికూడా ఎంతోకాలం సాగలేదు; బాలరత్న సభ మూతపడడంతో ఇంటిదారి పట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. కాని నాజర్ తండ్రి నెలనెలా మూడురూపాయలు చెల్లిస్తూ వేరే సంగీతవిద్వాసునిదగ్గర విద్య కొనసాగింపజేసేరు. కొంతకాలానికి కుటుంబ పరిస్థితులు మరింత క్షీణించడంతో ఆ మూడురూపాయలు చెల్లించే స్థితికూడా లేకపోయింది. శుద్ధశ్రోత్రీయ బ్రాహ్మణుడైన ఆ సంగీతం ఉపాధ్యాయుడు నాజర్‍ను తన ఇంటివద్దనే ఉంచుకొని, తన ఇంట్లోనే భోజన సదుపాయాలను కల్పించి, నాజర్ సంగీత విద్యాభ్యాసాం కొనసాగేలా ఏర్పాటు చేసేరు. కానీ కళాకారుల జీవితాలు కన్నీటిగాథలే కదా!, తండ్రి హటాన్మరణంతో నాజర్ మళ్ళీ ఇంటిముఖం చూడవలసివచ్చింది. కుటుంబపోషణాభారాన్ని తనపై వేసుకొన్న నాజర్ మాతృమూర్తి పతి అడుగుజాడలలోనే నడచి, పుత్రుని సంగీత విద్యాభిలాషను నెరవేర్చడానికి నాజర్‍ను అక్కడకు దగ్గరలోనేఉన్న తాటికొండ గ్రామములో ఒక సంగీత విద్వాంసునివద్దకు పంపినది. ఆ ఊళ్ళో నాజర్ వారాల‍అబ్బాయిగా ఉంటూ విద్య కొనసాగించేడు. 
ఇంటిదగ్గర తల్లిపడుతున్న కష్టాన్ని చూడలేకపోయిన నాజర్ విద్యకు స్వస్తిచెప్పి, ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబభారాన్ని లాగడం మొదలుపెట్టాడు. దర్జీగా పనిచేస్తూకూడా కొంత సంపాదించసాగేడు. వివాహమైన తరువాత అత్తారిఊళ్ళో కొంతమందికి సంగీతం నేర్పుతూ సంపాదనని మెఱుగు పఱచుకొన్నాడు.  కమ్యూనిస్టు భావజాలానిని గట్టిగా నమ్మిన   నాజర్ ఆ పార్టీలోచేరి, దాని వ్యాప్తికి తన కళాకౌశలాన్ని బాగా ఉపయోగించేడు. కానీ ఆ పార్టిమీద అప్పట్లో నిషేధం ఉండడంవల్ల అంత చుఱుకుగా ఉండలేకపోయాడు. నిషేధం తొలగిపోయిన తరువాత ప్రజానాట్యమండలి అనే సంస్థతో ఎన్నో బుర్రకఠలను చెప్పనారంభించేడు; అది దాదాపు 1941లో. ఆ బుర్రకథలలో తన స్వంతగాథనే చెప్పుకొంటున్నట్లు భావించేవాడు.
అంతవరకూ నాజర్ ఇతరులు వ్రాసిన కథలను ప్రదర్శిస్తుండేవాడు. నాజర్‍లో నిక్షిప్తమైయున్న నటనాకౌశలాన్ని, గానసంపదను గమనించిన ప్రయాగ కోదండరామశాస్త్రిగారు నాజర్‍ని స్వంతరచనలకు పూనుకొమ్మని ప్రోత్సహించేరు. దాంతో నాజర్‍లోని సాహిత్యకారుడు మేల్కొని పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం, కళింగయుద్ధం మొదలగు ఎన్నో బుర్రకథలను రచించి కళామతల్లికి అంకితం ఇచ్చేరు. వాడవాడల నాజర్‍దళాలు ఏర్పడి బుర్రకథలకు క్రొత్త ఒరవడిని తెచ్చాయి. స్వాతంత్ర్యముతరువాత బుర్రకథలలో కొన్ని మార్పులు సహజంగానే చోటుచేసు కొన్నాయి. బుర్రకథలను రాజకీయపక్షాల ప్రచారానికి, ప్రభుత్వపథకాల ప్రాచుర్యానికి వాడుకోవడం మొదలయ్యింది. తరువాత ఎన్నో కళలలాగే ఆదరణను కోల్పోయింది. తెలుగు-ఫ్రెంచ్, ఫ్రెంచ్-తెలుగు నిఘంటువును సంకలపఱచడానికి భారతదేశము వచ్చిన ఫ్రాన్స్ దేశస్థుడు డేనియల్ నెగెర్ తెలుగుసీమలో కలయతిరిగి నాజర్‍గారి బుర్రకథల నెన్నింటినో సంగ్రహించేరు.   
కళింగరాజ్యం కంటబడ్డది, పదాదిసైన్యం వెంటబడ్డది
కత్తులుదూశారూ రక్తపుమడుగుల తేలారూ...
(-కళింగయుద్ధం బుర్రకథనుండి)