విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌


చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని బీఫార్మసీ ప్రోగ్రామ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ( నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) టైర్‌2 అక్రిడిటేషన్‌ సాధించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీ కేంద్రంగా ఏఐసీటీఈ అనుబంధంతో ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌కు సంబంధించిన తనీఖీ బృందం విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో 2021 సంవత్సరం నవంబర్‌ 27 నుంచి రెండు రోజుల పాటు పర్యటించిందన్నారు. తనీఖీ బృందం విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు అందించే విద్యా విధానం, సిలబస్‌ కంటెంట్, టీచింగ్‌ మెథడాలజీ, అకాడమిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్, స్పోర్ట్స్, హాస్టల్‌ వసతి, విద్యార్థుల అచీవ్‌మెంట్స్, అత్యాధునిక ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌లన్నింటిని రెండు రోజులపాటు విస్తృతంగా పరిశీలించిందన్నారు.  విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలనే విద్యార్థులు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ను సాధించిన విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల అందించే డిగ్రీ సర్టిఫికెట్‌తో ప్రవేశాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక స్థాయిలో గ్రాంట్లు, ప్రాజెక్టులు పొందవచ్చునన్నారు. అక్రిడిటేషన్‌ ఉండటం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు స్థానం లభిస్తుందన్నారు. అంతేకాకుండా  విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ మూడు సంవత్సరాలు పాటు లభించిందని తెలియజేసారు. విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని బీఫార్మసీ ప్రోగ్రామ్‌కు ఎన్‌బీఏ టైర్‌2 అక్రిడిటేషన్‌ సాధించడంలో కృషి చేసిన ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక బృందాన్ని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అభినందించారు.