గుంటూరులో ఐటీసీ వెల్కం హోటల్ని ప్రారంభించిన సీఎం వైయస్.జగన్
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ
గుంటూరు రావడం చాలా సంతోషం.
ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజివ్ పూరికి ధన్యవాదాలు. ఐటీసీతో భాగస్వామ్యం మంచి అవకాశం. ఈ రోజు మనం ఈ హోటల్ ప్రారంభించుకోవడం ఓ మంచి కార్యక్రమం.
గుంటూరు లాంటి పట్టణంలో ఫైవ్స్టార్ హోటల్ ఉండటం, అలాంటి ఫైవ్స్టార్ హోటల్లో ఐటీసీ భాగస్వామ్యం కావడం మంచి పరిణామం. ఐటీసీ భాగస్వామ్యంతో మనం వ్యవసాయరంగంలో ప్రత్యేకంగా పుడ్ ప్రాససింగ్లో ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మనం ఏ గ్రామానికి వెళ్లినా మీరు మూడు రంగాల్లో సమూలమైన మార్పులు చూస్తారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మీరు ఈ మార్పులు గమనించవచ్చు. వ్యవసాయరంగం తీసుకుంటే ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ఉన్నాయి. దాదాపు 10,700 ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యం. గ్రామస్ధాయిలో వ్యవసాయరంగంలో ఏ రకమైన మౌలిక సదుపాయలను ప్రైమరీ ప్రాససింగ్ లెవల్లో కల్పించాం, ఇంకేం కల్పించాలన్నది చాలా ముఖ్యమైన అంశం. పార్లమెంట్ నియోజకవర్గ స్ధాయిలో సెకండరీ ప్రాససింగ్ లెవల్లో ఏర్పాటు కానున్నాయి. ఈ విషయంలో ఐటీసీ కూడా ముందుకు వచ్చి భాగస్వామ్యం కావడం ద్వారా కీలకమైన పాత్ర పోషించనుంది.
గుంటూరు పట్టణంలో ఫైవ్ స్టార్ హోటల్ రావడం చాలా మంచి పరిణామం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో తొలి లీడ్ ప్లాటినం సర్టిఫైడ్ ఫైవ్స్టార్ హోటల్ కావడం కూడా సంతోషించతగ్గ విషయం. ఐటీసీతో ఇంకా మరింత దృఢంగా, పెద్ద ఎత్తున భాగస్వామ్యులవుతున్నాం. ప్రధానంగా పర్యాటక, వ్యవసాయ, పుడ్ ప్రాససింగ్ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని బలంగా నమ్ముతున్నాం అని సీఎం జగన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, గృహనిర్మాణశాఖమంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.