‘‘విజ్ఞాన్ ఆన్లైన్’’ ఘనంగా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీద ప్రారంభం
ఆన్లైన్ విద్యావిధానమే ట్రెండింగ్ : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విజ్ఞాన్స్ వర్సిటీకి మరో మైలురాయి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి
విజనరీ ఆలోచనా విధానం : గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యం: విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
ఉద్యోగాలు కల్పించే దిశగా శిక్షణ : విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ’’విజ్ఞాన్ ఆన్లైన్’’ లాంచింగ్ ప్రోగ్రామ్ను గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన్ ఆన్లైన్ లాంచ్ ప్రోగ్రామ్ లోగో, బ్రౌచర్, www.vignanonline.com వెబ్సైట్ను గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి, విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్, డైరక్టర్ టామ్ జోసెఫ్ కూడా పాల్గొని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మినిస్టర్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్ లెర్నింగ్ విభాగంలో బీబీఏ(జనరల్), ఎంబీఏ (హెచ్ఆర్), ఎంబీఏ (ఫైనాన్స్), ఎంబీఏ(జనరల్) కోర్సులతో పాటు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విభాగంలో 4 కోర్సులైన బీబీఏ (జనరల్), ఎంబీఏ (ఫైనాన్స్), ఎంబీఏ (జనరల్), ఎంబీఏ (హెచ్ఆర్) కోర్సులకు సంబంధించిన క్లాసులను విద్యార్థులకు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. భవిష్యత్లో విద్యార్థులకు ఆన్లైన్ విద్యా విధానమే ట్రెండింగ్ కానుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, లైఫ్ సైన్స్, మెడికల్, బయో మెడికల్ వంటి కోర్సులు మానవాళికి నిత్యజీవితంలో అత్యవసరమన్నారు. స్టూడెంట్ సెంట్రిక్ విద్యా విధానంతో పాటు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విద్యార్థులకు అందుబాటులో రావాలన్నారు.
విజ్ఞాన్స్ వర్సిటీకి మరో మైలురాయి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ నేడు ‘‘ విజ్ఞాన్ ఆన్లైన్ ’’ లాంచింగ్ ప్రోగ్రామ్తో బీబీఏ, ఎంబీఏ కోర్సులను ఆన్లైన్లో విద్యార్థులకు చేరువ చేయడం ద్వారా విజ్ఞాన్కు ఇది మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా విద్యా విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విజ్ఞాన్స్ సంస్థలు ఎల్లప్పుడు ముందుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానాన్ని బ్రిక్స్ దేశాలతో పోటీపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.
విజనరీ ఆలోచనా విధానం : గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
బీబీఏ, ఎంబీఏ వంటి యూజీ, పీజీ కోర్సులను కోర్సులను విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు అందజేయడమనేదే విజనరీ ఆలోచనా విధానమని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. భవిష్యత్ అవసరాలు, మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎప్పటికప్పడు టెక్నాలజీలను అప్డేట్ చేసుకోవాలని తెలిపారు.
విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యం: విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
విజ్ఞాన్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా మరింత మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు వారికి చేరువ కావడమే లక్ష్యమని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. 21వ శతాబ్ధంలో విద్యార్థులు ఉపాధ్యాయులపైనో, కళాశాలల్లో ఉండే అధ్యాపకులపైనో ఆధారపడకూడదన్నారు. ఎవరైతే స్వయం శిక్షణ( సెల్ఫ్ లెర్నింగ్) చేస్తారో వాళ్లకే నిజమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. నేటి డిజిటల్ యుగంలో ఈ రోజు ఉన్నవి రేపటి రోజున ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. క్షణ క్షణం విషయం మారిపోవటం, కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదానికి కళాశాలకు వెళ్లి నేర్చుకుంటామంటే కుదిరే పనికాదన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులు అంతర్జాలంలోకి వెళ్లి నేర్చుకునేందుకు అలవాటుపడాలన్నారు.
ఉద్యోగాలు కల్పించే దిశగా శిక్షణ : విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు
బీబీఏ, ఎంబీఏ కోర్సులను ఆన్లైన్లో పూర్తి చేసిన విద్యార్థులందిరికీ ఉద్యోగాలు కల్పించే దిశగా శిక్షణ ఇస్తామని విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించడానికి అవసరమయ్యే అన్ని నైపుణ్యాలను విద్యార్థులకు అందజేస్తామన్నారు.