లూయీ బ్రెయిల్ అంధుల ఆశాజ్యోతి

లూయీ బ్రెయిల్ అంధుల ఆశాజ్యోతి.
                  - వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.

ప్రపంచవ్యాప్తంగా అంధుల జీవితాల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే బ్రెయిలీ లిపి ని 
 రూపొందించి అంధుల ఆశాజ్యోతిగా లూయీ బ్రెయిల్ నిలిచారని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 6వ తేదీ గుంటూరు బ్రాడీపేట లోని శ్రీ షిర్డీ
సాయి దీన జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన లూయీ బ్రెయిల్ వర్ధంతి కార్యక్రమానికి లక్ష్మణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై
ప్రసంగించారు.సభకు శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి అధ్యక్షులు ఆనంగి పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ లూయీ బ్రెయిల్ అంధుల అంధకార జీవితంలో వెలుగులు నింపారన్నారు.ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్లకు పైగా అంధులు ఉన్నారని భారతదేశంలో కోటి ఇరవై లక్షల మంది అంధులు ఉన్నారని తెలియజేశారు.బ్రెయిలీ లిపి అంధులకు చుక్కానిగా నిలిచిందన్నారు.మేనరిక వివాహాలు సంపూర్ణంగా నిరోధించడం ద్వారా అంగవైకల్యాన్ని అధికమించగలమన్నారు.శ్రీలంక ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలు నేత్రదాన ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.విశిష్ట అతిథిగా విచ్చేసిన విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ కార్పొరేషన్ చైర్ పర్సన్ కుమారి ముంతాజ్ పఠాన్ ప్రసంగిస్తూ శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి సంస్థ 1995లో ప్రారంభమై వందలాది అంధులకు బ్రెయిలీ లిపితో  జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంస్థ సేవలను కొనియాడారు. వికలాంగులకు,అంధులకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.నేత్రదానన్ని ప్రోత్సహించాలని కోరారు.సంస్థ అధ్యక్షులు ఆనంగి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పబ్బరాజు వెంకటేశ్వరరావు ఈ సంస్థను స్థాపించి వందలాది అంధులలో వెలుగులు నింపారని కొనియాడారు.
పోటీ పరీక్షలలో అంధులకు శిక్షణ, నైపుణ్యాలను అందించి అనేక మంది బ్యాంకు అధికారులు గా, ఉపాధ్యాయులుగా నియమితులు అవటం పట్ల ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పీఎస్ మూర్తి,ఉపాధ్యక్షులు మధుసూదన్ రావు,అంధులైన బ్యాంక్ ఆఫీసర్ కోటిరెడ్డి,అంధులైన రిటైర్డ్ లెక్చరర్ లింగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన  లక్ష్మణరెడ్డి,ముంతాజ్ పఠాన్ ల కు సంస్థవారు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.