విజ్ఞాన్స్ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్–2కే22’
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ మీట్ ‘‘ కైజెన్–2కే22’ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్( కీ టు ఆంబీషియస్ అండ్ ఇంటెలెక్చుయల్ జోన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నోవల్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఖానా–పఖానా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వంటల పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ డైవర్సిటీ, మోడ్యులారిటీ, ఓపెన్నెస్, స్లాగ్ రిసోర్సెస్, మ్యాచింగ్ సైకిల్... ఈ ఐదు సూత్రాలను విద్యార్థులు పాటించినట్లైతే విజయం తథ్యమన్నారు. భవిష్యత్తు లక్ష్యాలు సాధించాలంటే మన సంపాదనలో కొంత భాగాన్ని క్రమశిక్షణతో పొదుపు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మార్కెట్లో కొన్ని వేల కంపెనీలు ఉంటాయని, వాటి పనితీరును అంచనావేస్తూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఏ వ్యాపారానికైనా సరే రాబడి విషయంలో నిజంగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించుకోవడం కూడా ఓ కళేనన్నారు. వ్యాపారాల్లో ప్రాథమిక పరిశోధనా పద్ధతులు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబడికి నూతన మార్గాలు అన్వేషించడం, ఉత్పత్తి అయిన వస్తువులకు డిమాండ్ పెంచుకోవడం, నష్టాలొస్తుంటే అందుకు గల కారణాలు లాంటి అన్ని అంశాలపై పరిశోధనాత్మకంగా ఆలోచించే ధోరణి అలవాటు చేసుకోవాలని చెప్పారు.