విజ్ఞాన్స్లో ఘనంగా నేషనల్ సైన్స్ డే
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం నేషనల్ సైన్స్ డే సంబరాలను ఘనంగా నిర్వహించామని వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆప్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్, ఐక్యూఏసీల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టేనబుల్ ఫ్యూచర్’’ అనే అంశంపై సైన్స్ డేను నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోని కెమిస్ట్రీ డివిజన్ డాక్టర్ ఎస్.ఎన్.ఆచారీ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వంటి అవాంతరాలను ఎదుర్కోవడంలో సైన్స్ పాత్ర ఎనలేనిదన్నారు. దశాబ్ధాలుగా గడిచిన అనుభవం, సేకరించిన పరిజ్ఞానం ఆధారంగా శాస్త్రవేత్తలు స్వల్పకాలంలోనే కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేసి వేగంగా జనబాహుళ్యానికి అందించగలిగారన్నారు. ప్రభుత్వాలు బడ్జెట్లో శాస్త్రసాంకేతిక రంగాలలో పరిశోధన, అభివవృద్ధికి గణనీయంగా నిధులు కేటాయించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆధునిక ప్రయోగశాలల ఏర్పాటుపై పాలకులు దృష్టిసారించడం అత్యవసరమన్నారు. విద్యార్థులకు తార్కిఖంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే వాతావరణాన్ని కల్పించాలని తెలియజేసారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలని పేర్కొన్నారు.