నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్
కేరళలోని సీడబ్యూఆర్డీఎమ్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కమలం జోసెఫ్
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా వరల్డ్ వాటర్ డే
కంటికి కనిపించని భూగర్భ జలాన్ని పది కాలాలపాటు కాపాడుకుంటేనే మానవ జాతికి భవిష్యత్ ఉంటుందని కేరళలోని సీడబ్యూఆర్డీఎమ్ (సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్) సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కమలం జోసెఫ్ పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫోరమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ల సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ వాటర్ డేను పురస్కరించుకుని ‘‘ నీడ్ ఫర్ ఎఫెక్టివ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇన్ ఎన్సూరింగ్ వాటర్ సెక్యూరిటీ’’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ గ్రౌండ్ వాటర్ : మేకింగ్ ద ఇన్విసిబుల్ విసిబుల్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కమలం జోసెఫ్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదిత జలానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ అమూల్యమైన సహజ వనరును పరిరక్షించుకుంటూ పొదుపుగా, సమర్థంగా వాడుకుంటేనే జల సంక్షోభాలను ఎదుర్కోగలమన్నారు. వర్షాలు తగ్గిపోవడం వలన భూగర్భ జలాలపై ఒత్తిడి అధికమై తాగునీటికి కటకట ఏర్పుడుతోందన్నారు. కురిసిన వర్షంలో అధిక శాతం వృథాగా పోవడం, నిల్వ చేసుకోవడానికి తగిన సదుపాయాలు లేకపోవడం, వర్షాలు అన్నిచోట్ల సమానంగా కురవకపోవడం కూడా కారణమన్నారు. ప్రస్తుత నీటి లభ్యత, వర్షపాతాల పరిస్థితులనుబట్టి చూస్తే భవిష్యత్లో తీవ్ర కొరత ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటినుంచైనా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, భూగర్భం నుంచి తీసుకునే నీటికి రెట్టింపు జలాన్ని నేలలోకి ఇంకించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీనికోసం ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ ఛాంబర్లు, పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు. పట్టణాలు, నగరాల్లో వర్షం నీటిని నిల్వచేసే భూగర్భ ట్యాంకుల నిర్మాణం తప్పనిసరి చేయాలన్నారు.