కోవిడ్–19పై పుస్తకం రాసిన విజ్ఞాన్స్ విద్యార్థిని
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని మొదటి సంవత్సరం సీఎస్ఈ విభాగానికి చెందిన యడ్లపాటి గాయత్రీ బాల కోవిడ్–19పై పుస్తకం రాసిందని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డైరీ ఆఫ్ కోవిడ్–19 జర్నీ’’ అనే పేరుతో కెనడాలోని ప్రముఖ పబ్లిషర్స్ యూకీయోటో వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని కరోనా పాయింట్ ఆఫ్యూలో రాసిందని తెలియజేసారు. కరోనా ఎలా పుట్టింది? ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించింది? ఎంతమందిని బలితీసుకుంది? వివిధ రూపాల్లోకి ఎలా రూపాంతరం చెందింది? వ్యాక్సిన్ ఎలా తయారయ్యింది? ఇలా పలు అంశాలను బుక్లో ప్రస్తావించిందని వెల్లడించారు. అంతేకాకుండా ఈమె పియానో, గిటార్, వయోలిన్, వోకల్, వెంట్రిలాకిజమ్, రైటింగ్స్, స్పీకింగ్స్, ఎంబ్రాయిడింగ్, సింగింగ్ వంటి కళల్లో ప్రావీణ్యం కూడా ఉందన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మళయాళం, సాంస్క్రిట్, కొరియన్, అమెరికన్ సైన్ ల్యాంగ్వేజ్ వంటి భాషల్లో కూడా మంచి పట్టు ఉందన్నారు. డైరీ ఆఫ్ కోవిడ్–19 జర్నీ పేరుతో పుస్తకాన్ని రాసిన యడ్లపాటి గాయత్రీ బాలను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.