నిరుపేదల సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీఠవేసిన ప్రభుత్వం
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి, ఏఫ్రిల్ 19 : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి పెద్ద పీఠవేస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అయితే పలు వర్గాల ప్రజలకు నేరుగా లబ్దిచేకూర్చే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకాల వల్ల భవిష్యత్తులో తమ మనుగడగే కనుమరుగు అవుతుందన్న ఆలోచనలో ఉన్న ప్రతిపక్షపార్టీ తమ అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై దుష్రచారానికి పాల్పడుతున్నదన్న ఆవేదనను ఆయన వ్యక్తంచేశారు. ఇటు వంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వారు ఎంతో విజ్ఞులని, ప్రతిపక్షపార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం అమలు పర్చే సంక్షేమ పథకాలను అన్నింటినీ రద్దు చేస్తుందనే విషయం వారికి తెలుసని ఆయన అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వల్ల పలు వర్గాల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుచున్నదో మంత్రి వివరించారు.
బడిఈడు పిల్లలను అందరినీ బడికి పంపించే విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నదని, ఈ పథకం క్రింద 84 లక్షల మంది పిల్లలకు లబ్దిచేకూర్చే విధంగా 44.5 లక్షల మంది తల్లుల ఖాతాలో ఇప్పటి వరకూ రూ.13,022 కోట్లను నేరుగా జమచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్ మెంట్ చేసే విధంగా ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నదని, ఈ పథకం క్రింద దాదాపు 21.5 లక్షల మంది విద్యార్థులకు లబ్దిచేకూర్చే విదంగా రూ.7000 కోట్లను, విద్యా కానుక క్రింద రూ.1500 కోట్లను.ప్రభుత్వం వెచ్చించిందన్నారు. జగనన్న వసతి దీవెన పధకం క్రింద రూ.19 లక్షల మంది విద్యార్థులకు లబ్దిచేకూర్చే విధంగా రూ.3,230 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జగనన్న గోరుముద్ద పథకం క్రింద 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్దిచేకూర్చే విధంగా ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.2,640 కోట్లను వెచ్చించిందన్నారు.
అదే విధంగా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేలా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ పథకం క్రింద 52.4 లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా రూ.20,162 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.5 వేల కోట్ల మేర లబ్దిచేకూర్చే విధంగా సున్నా వడ్డీ రుణాలు, పంటల భీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.
అదే విధంగా వైఎస్సార్ చేయుత పథకం క్రింద ఏకంగా 25 లక్షల కుటుంబాలకు లబ్దిచేకూర్చే విదంగా రూ.9,180 కోట్లను వెచ్చించడమైందన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం క్రింద 78.75 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా రూ.12,758 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో 31 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, అంతిమంగా ఈ పథకం ద్వారా లబ్దిదారులకు దాదాపు 3 లక్షల కోట్ల మేర లబ్దిచేకూరుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ ను పంపిణీ చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు ల్దబిచేకూర్చే విధంగా 200 యూనిట్ల మేర ఉచిత కరెంటును ప్రభుత్వం సరఫరా చేస్తున్నదన్నారు.
అదే విధంగా పొదుపు సంఘాలకు చెందిన దాదాపు కోటి మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూర్చే విధంగా రూ.2,354 కోట్ల మేర సున్నా వడ్డీ రుణాలను అందజేయడమైందని మంత్రి తెలిపారు. వైఎస్సార్ పెన్షన్ కానుక క్రింద రాష్ట్రంలోని దాదాపు 62 లక్షల మంది వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ప్రతి నెలా ఫించనుగా రూ.2500/- చొప్పున అందజేస్తూ ఇప్పటి వరకూ 49 వేల కోట్లను వెచ్చించడమైందన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం క్రింద రాష్ట్రంలోని 82 వేల నేత కుంటుంబాలకు ఇప్పటి వరకూ రూ.577 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయడమైందన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం క్రింద 3.3 లక్షల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.982 కోట్లను పంపిణీ చేయడమైందన్నారు. వైఎస్సార్ ఇ.బి.సి. నేస్తం క్రింద 4 లక్షల కుటుంబాలకు ఇప్పటి వరకూ రూ.589 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయడమైందని మంత్రి తెలిపారు. జగనన్న చేదోడు క్రింద 3 లక్షల కుటుంబాలకు రూ.594 కోట్లను, జగనన్న తోడు పధకం క్రింద రూ.14.16 లక్షల కుటుంబాలకు రూ.1,416 కోట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీ చేసిందన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం క్రింద 2.75 లక్షల కుటుంబాలకు రూ.770 కోట్ల మేర లబ్దిచేకూర్చడమైందన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలకు లబ్దిచేకూర్చే విధంగా రూ.5,750 కోట్లను, వైఎస్సార్ ఆసరా పథకం క్రింద రూ.545 కోట్లను ఇప్పటి వరకు వెచ్చించడమైందన్నారు. సంపూర్ణ పోషణ పథకం క్రింద 34 లక్షల మందికి పైగా లబ్దిచేకూర్చే విధంగా రూ.4,900 కోట్లను వెచ్చిండమైందన్నారు.
రాష్ట్రంలో ఇటు వంటి వినూత్న పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడం వల్ల కోవిడ్ సమయంలో కూడా నిరుపేదలకు ఎంతో ఊతమిచ్చే విధంగా ఈ పథకాలు సహకరించాయని, ఈ పథకాలే లేకుంటే నిరుపేదల పరిస్థితి ఏవిధంగా ఉండేదో ఊహించుకోవడానికి భయమేస్తుందని మంత్రి తెలిపారు.
అదే విధంగా ఈ మద్యే జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం ప్రాతిపదికగా 70 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం జరిగిందని, తొలి విడత మంత్రి వర్గంలో 56 శాతం ఇచ్చి చరిత్ర సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికే సాద్యమైందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమానికి, అభ్యున్నతికి ఎంతగానో కృషిచేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు ఎంతగానో అండగా ఉంటారని, ప్రతిపక్షపార్టీకి మద్దతునిచ్చే ప్రచార మాద్యమాల వార్తాంశాలను వారు ఏమాత్రం పట్టించుకోరని, వచ్చే 30 ఏళ్ల వరకూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన పునరుద్ఝాటించారు.
(ప్రచార విభాగం సమాచార శాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)