విజ్ఞాన్స్ యూనివర్సిటీకు రూ.కోటి డీఎస్టీ ప్రాజెక్ట్ మంజూరు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకి న్యూఢిల్లీలో గల డీఎస్టీలోని అడ్వాన్డ్స్ మ్యానుఫ్యాక్చురింగ్ కేటగిరీలో రూ.కోటి విలువ గల ప్రాజెక్టు మంజూరైందని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘కాస్ట్ ఎఫెక్టివ్ ఆటోమేటెడ్ అడిటివ్ మ్యాన్యుఫ్యాక్చురింగ్ హబ్ ఫర్ సస్టేనబిలిటీ ఆఫ్ ఎంఎస్ఎమ్ఈస్’’అనే అంశంపై పరిశోధనకు గాను రాబోయే 3 సంవత్సరాలకు గ్రాంటు మంజూరైందన్నారు. ఈ ప్రాజెక్టు వలన ఆటోమొబైల్ రంగంలో మెటల్ పరికరాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఉపయోగపడేలా త్రీడీ ప్రింటింగ్ మెషీన్ను తయారుచేస్తారు. ఈ ప్రాజెక్టు సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ మన్నికైన త్రీడీ ప్రింటింగ్ డేటా బేస్ను రూపొందించవచ్చు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో కృషి చేసిన మెకానికల్ విభాగానికి చెందిన అధ్యాపకులను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.