విజ్ఞాన్స్లో ఘనంగా అవగాహన వెబినార్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఈ–సెల్ ఆధ్వర్యంలో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డేను పురస్కరించుకుని ‘‘ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆన్ అకడమియా’’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన వెబినార్ను నిర్వహించామని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర యూనివర్సిటీ డీపీఐఐటీ–ఐపీఆర్ చైర్ ప్రొఫెసర్ హెచ్.పురుషోతమ్ మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సరికొత్త ఇన్నోవేషన్స్ను సృష్టించే విద్యార్థులు వాటిపై పేటెంట్స్ను పొందడం వలన దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పేటెంట్స్ను సాధించడానికి ఎలా ప్రయత్నించాలో దశల వారీగా వివరించారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రభుత్వ నిపమ్ ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఎగ్జామినర్ లావణ్య మద్దురి మాట్లాడుతూ రీసెర్చ్ జర్నల్స్కు– పేటెంట్స్కు మధ్య వ్యత్యాసాలను విద్యార్థులకు విశదీకరించారు. రీసెర్చ్ జర్నల్స్ కోసం ప్రయత్నించకుండా విద్యార్థులు పేటెంట్స్ను సాధించినట్లైతే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ ఈ–సెల్ డైరక్టర్ ప్రొఫెసర్ బీ.నాగేశ్వరరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.