అందరూ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలి
ఏరువాక టెక్నాలజీస్ సీఈవో శ్రీరామ్ రావి ఏరువాక
విద్యార్థులందరూ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలని ఏరువాక టెక్నాలజీస్ సీఈవో శ్రీరామ్ రావి ఏరువాక అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసెల్ ఆధ్వర్యంలో ‘‘ ఇట్స్ మై స్టోరీ’’ అనే ఇతివృత్తంతో స్ఫూర్తిదాయకమైన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరువాక టెక్నాలజీస్ సీఈవో శ్రీరామ్ రావి మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలని భావించే విద్యార్థులు వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లే బదులు దేశంలోని ఉండి వివిధ ఎంటర్ప్రెన్యూర్స్ను స్థాపించి, దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చునన్నారు. ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరని, కేవలం మార్కులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా విషయపరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు.