తల్లిదండ్రుల త్యాగఫలం ఎనలేనిది

తల్లిదండ్రుల త్యాగఫలం ఎనలేనిది

  టీసీఎస్‌ టాలెంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డెలివరీ హెడ్‌ శ్రీనివాస రామానుజం కండూరి

  విజ్ఞాన్స్‌ నిరులాలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం

పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు ఎనలేనివని టీసీఎస్‌లోని ఏడబ్యూఎస్‌ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్‌ టాలెంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డెలివరీ హెడ్‌ కండూరి శ్రీనివాస రామానుజం పేర్కొన్నారు. స్థానిక పెదపలకలూరు పరిధిలోని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన 550 మంది విద్యార్థినుల తల్లిదండ్రులకు శుక్రవారం  ఘన సత్కారం కార్యక్రమం నిర్వహించారు. విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ ఏడాది మొత్తం 550 మంది విద్యార్థినులు ప్రాంగణ ఎంపికల ద్వారా 50కి పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. మొత్తం మీద 98  శాతం మంది విద్యార్థినులు ఆయా సంస్థల్లో కొలువులు కొల్లగొట్టారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినుల తల్లిదండ్రులందరినీ శుక్రవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీసీఎస్‌లోని ఏడబ్యూఎస్‌ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్‌ టాలెంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డెలివరీ హెడ్‌ శ్రీనివాస రామానుజం కండూరి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని కోసం శ్రమించాలని విద్యార్థి దశలో కష్టపడి చదివి ఉన్నత స్థానంలోకి వస్తే జీవితాంతం సుఖంగా జీవించవచ్చన్నారు. నిరంతర సాధన, కృషి ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులను జయించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ కొత్త టెక్నాలజీలు, కోర్సులను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. డేటాబేస్‌. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ వంటి కోర్సుల్లో నిష్ణాతులవ్వాలన్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని, పనిని– వర్క్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఉపాధి కలిగించే దిశగా అడుగులేయండి: విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ 
ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగిగా కాకుండా... అందరికీ ఉపాధి కలిగించే దిశగా అడుగులు వేయాలని కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రశ్నించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మనలోని సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకుని సమస్యలకు పరిష్కారం కనుగొనగలగాలి. సృజనాత్మకతను పెంపొందించుకోవాలి. ఆశించిన పలితాలను సాధించేందుకు మనోధైర్యాన్ని కూడగట్టుకుని పోటీ ప్రపంచానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులకు సూచించారు.

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మ¯Œ
విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు ఐవోటీ, బిగ్‌డేటా, రోబోటిక్స్‌ లాంటి నూతన సాంకేతిక అంశాలను నేర్చుకోవాల్సిందేనన్నారు. మంచి వ్యక్తిత్వం, సహనం, పట్టుదల, కష్టపడేతత్వం ఉన్న విద్యార్థులు జీవితంలో అందరికంటే ఉన్నతంగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఉద్యోగాలకే పరిమితమవవకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సూచించారు. కీర్తిప్రతిష్టలు, సంపాదన పొందే విషయంలో తనకంటే పది రెట్లు మిన్నగా ఉండాలని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు.