విజ్ఞాన్స్లో ఘనంగా ప్రారంభమైన ఐసీఎమ్ఎస్ఏ–22 అంతర్జాతీయ కాన్ఫరెన్స్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించామని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలోని సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డివిజన్ ఆఫ్ మేథమ్యాటిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘‘ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్ (ఐసీఎమ్ఎస్ఏ–22)’’ అనే అంశంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను హైబ్రిడ్ మోడ్లో ( ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్) నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఆన్లైన్లో ముఖ్య అతిథిగా హాజరైన ఆస్ట్రేలియాలోని మెల్బౌర్న్ విక్టోరియా యూనివర్సిటీ ఐఎస్ఐఎల్సీ అండ్ డిజైన్ సైన్సెస్ అండ్ మోడలింగ్ ప్రోగ్రామ్ ప్రొఫెసర్ సర్దార్ ఎం.ఎన్. ఇస్లామ్ మాట్లాడుతూ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు భవిష్యత్లో డేటాసైన్స్ను పరిశోధనాంశంగా ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని మల్టీ నేషనల్ కంపెనీలు డేటాసైన్స్ను విరివిగా వినయోగిస్తున్నారని తెలియజేసారు. కాబట్టి ఇందులో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. కార్యక్రమానికి ఆన్లైన్లో మరో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంకలోని యూనివర్సిటీ ఆఫ్ కొలొంబోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమ్యాటిక్స్ ప్రొఫెసర్ సంజీవ నిశాంత్ పెరేరా మాట్లాడుతూ మాథమ్యాటిక్స్లో ప్రస్తుతమున్న అప్లికేషన్స్ను విద్యార్థులకు వివరించారు. న్యూమరికల్ మెథడ్స్, గ్రాఫ్ థియరీ, మేథమ్యాటికల్ మోడలింగ్, ఫజ్జీ మేథమ్యాటిక్స్ గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు.