విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్‌పీటీఈల్‌ ర్యాంకింగ్స్‌లో ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఎన్‌పీటీఈఎల్‌ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జాతీయస్థాయిలో 18వ ర్యాంక్‌ సాధించి ‘‘ఏఏ గ్రేడ్‌’’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు పాల్గొని 1627 కోర్సు సర్టిఫికెట్లు సాధించారన్నారు. వీటిలో 45 మందికి టాపర్స్, 19 గోల్డ్, 234 సిల్వర్, 669 ఎలైట్, 705 మంది సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్స్‌ సాధించారని వెల్లడించారు. 2022వ సంవత్సరంలో ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నిర్వహించిన కోర్సులలో ఉత్తమ ప్రతిభకు గాను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని వెల్లడించారు. ‘‘ఏఏ గ్రేడ్‌’’కు సంబంధించిన సర్టిఫికెట్‌ను  ఐఐటీ మద్రాస్‌కు సంబంధించిన నిర్వాహకులు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్‌ అండ్‌ మోనటరింగ్‌ డీన్, ఎన్‌పీటీఈఎల్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌కు అందజేసారు.