విజ్ఞాన్స్‌లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

విజ్ఞాన్స్‌లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఉట్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఉట్టి ఉత్సవం ఐక్యతకు, సమష్టితత్వానికి ప్రతీక అని  తెలిపారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉట్టి ఉత్సవంలో పాల్గొని ఉట్టిని పగులగొట్టారు. ఎంతో ఎత్తున ఉండే ఉట్టిని పగులగొట్టడం ద్వారా సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చనే విషయాన్ని తెలుపుతుందన్నారు. జీవితంలో ప్రతి విజయానికి సమష్టి కృషి ఎంతో అవసరమని వెల్లడించారు. ఇప్పటి నుంచే విద్యార్థులు నలుగురితో కలిసి మెలిసి పనిచేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. 

ఉట్టి ఉత్సవంతో ఉల్లాసం
కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి ఉత్సవం ఆద్యంతం ఉల్లాసాన్ని నింపింది. దాదాపు 50 జట్లు ఈ ఉట్టి ఉత్సవంలో పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో 12 మంది చొప్పున ప్రాతినిధ్యం వహించి ఉట్టిని కొట్టే వేడుకల్లో పాలుపంచుకున్నారు. 12 మంది పిరమిడ్‌లా ఏర్పడి ఉట్టిని పగులగొట్టిన వైనం అబ్బురపరిచింది. ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.