ఇండస్ట్రియల్ రోబోలదే భవిష్యత్
- హైదరాబాద్లోని డీఆర్డీవో సైంటిస్ట్ ఎఫ్ డైరక్టర్ డాక్టర్ పీ.అనిల్ కుమార్
- విజ్ఞాన్లో ఘనంగా ముగిసిన మూడో జాతీయస్థాయి కాన్ఫరెన్స్
భవిష్యత్తులో ఇండస్ట్రియల్ రోబోల హవా రాబోతుందని హైదరాబాద్లోని డీఆర్డీవో సైంటిస్ట్ ఎఫ్, మేనేజ్మెంట్ సర్వీసెస్ రీసెర్చ్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ పీ.అనిల్ కుమార్ పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘‘అడ్వాన్సెస్ ఇన్ మోడలింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన మూడో జాతీయస్థాయి కాన్ఫరెన్స్ను శనివారం ఘనంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్లోని డీఆర్డీవో సైంటిస్ట్ ఎఫ్, మేనేజ్మెంట్ సర్వీసెస్ రీసెర్చ్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ పీ.అనిల్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆటోమొబైల్స్, వ్యవసాయం, హాస్పిటల్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అన్ని రంగాలలోను రోబోలను వినియోగిస్తారని తెలిపారు. వాహనాలను కూడా రోబోలే నడుపుతాయని పేర్కొన్నారు. ప్రపంచ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులు పరిశోధనలకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నలుగురు అంతకుమించి సమూహాలుగా ఏర్పడి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.