విద్యార్థులు జీవితాన్ని ప్రేమించాలి

విద్యార్థులు జీవితాన్ని ప్రేమించాలి

  - విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు         రత్తయ్య

 విజ్ఞాన్స్‌ లారాలో బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం

విద్యార్థులందరూ జీవితాన్ని ప్రేమించాలని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం నుంచి బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టుల గురించే ఆలోచిస్తూ తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. విద్యార్థులందరూ కోడింగ్‌ స్కిల్స్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలన్నారు. విద్యార్థుల ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని, జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాటి కోసం నేటి నుంచే కష్టపడటం మొదలుపెట్టాలన్నారు. విద్యార్థులందరూ కమ్యూనికేషన్‌ స్కిల్స్, టీమ్‌ స్పిరిట్, క్రియేటివిటీ పెంచుకోవాలన్నారు. తమ కళాశాలలో చదువుకున్న విద్యార్థులలో అత్యధిక మందికి మల్టీనేషనల్‌ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. తమ కళాశాలలో కౌన్సిలింగ్‌ సిస్టంద్వారా ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అ«ధ్యాపకుడిని నియమిస్తామని చెప్పారు. దీని ద్వారా విద్యార్థులను ఎప్పటికప్పడు మానిటరింగ్‌ చేస్తూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి అభ్యున్నతికి తోడ్పడుతామన్నారు. తమ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం వలన నూటికి నూరు శాతం ఫలితాలను సాధిస్తున్నామన్నారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడంతో పాటు వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.