ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం

ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం
--అందిపుచ్చుకుంటేనే భవిత
--ఇక మీదట క్షణాల్లోనే కోరుకున్న సమాచారం
--జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో వీసీ ప్రసాద్‌రెడ్డి
విశాఖపట్నం.సెప్టెంబర్‌23: ప్రపంచ వ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం చోటుచేసుకోనుందని, అయితే సకాలంలో దానిని అందిపుచ్చుకుంటేనే భవిత చేకూరుతుందని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌ రెడ్డి అన్నారు. .శుక్రవారం స్థానిక హోటల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఇండియన్ డేటా పోర్టల్  ఏర్పాటు చేసిన జర్నలిస్టుల శిక్షణా తరగతులకు వీసీ  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాాడుతూ నేటి సమాజంలో ప్రతి విషయం ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉందన్నారు.వార్తా సేకరణ, ప్రచురణ, ప్రసారాలు కూడా సాంకేతికంగా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయన్నారు. ఒకప్పుడు వార్తా పత్రికలు,టెక్స్ట్, తరువాత పిక్చర్స్, దాని తరువాత వీడియోస్ రూపంలోకి కాలానుగుణంగా పరివర్తన చెందాయన్నారు. భవిష్యత్తులో మానవ మస్తిష్కంలోని వూహలను, ఆలోచనలను, అభిప్రాయాలను సైతం సంకేతాలుగా మార్చే  నైపుణ్యం అభివృద్ది చెందుతుందన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ దిశగా అప్పుడే ముందడుగు పడిందన్నారు.ఐదేళ్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని వీటన్నటినీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులు కాలంతో పాటు అభివృద్ది చెందుతున్న ఆధునిక సాంకేతికతను వేగంగా అందిపుచ్చు కోవాలన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ దీప్తీ సోని తొలుత వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా డేటాను ఏ విధంగా సమకూర్చుకోవచ్చన్నది తెలియజేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుమారు వంద విభాగాలకు సంబంఁధించిన సమాచారం ఇండియా డేటా పోర్టల్‌లో పొందుపర్చడం జరిగిందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పధకాలతో పాటు రూరల్‌ డవలప్‌మెంట్‌, వ్యవసాయం, డ్రాయింగ్‌ స్కీమ్స్‌, మంచినీరుతో పాటు అన్ని వివరాలు గణాంకాలతో సైతం సిద్దంగా ఉంటాయన్నారు. అయితే ఈ సమాచారాన్ని జర్నలిస్టులు స్వీకరించవచ్చున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలో రాష్ట్రాల సమాచారాన్ని పొందుపరుస్తామన్నారు. జర్నలిస్టులు ఆయా సమాచారాన్ని విశ్లేషించుకుని సమగ్రమైన వార్త కధనాలు రూపొందించుకోవచ్చున్నారు. 
--2030 వరకూ పత్రికలకు డోకా లేదు
కొవిడ్‌ అనంతరం పత్రికలు కొంత మేరకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోన్నప్పటికీ 2030 వరకూ పత్రికలకు ఎటువంటి డోకా లేదని ఇండియాన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ పాత్రికేయులు ఎం.సోమశేఖర్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా పత్రికలకు ఆదరణ తగ్గలేదు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ సమగ్ర సమాచారం, యదార్థంతో కూడుకున్న వార్త కధనాలు అందించినంత కాలం పత్రికల మనుగడకు ఇబ్బంది లేదన్నారు. జర్నలిస్టులు సమగ్ర సమాచారం తీసుకుని సమాజానికి అవసరమైన మరిన్ని మంచి కథనాలు అందించాలని కోరారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ  ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డులు తదితర జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై నిత్యం ఒత్తిడి తెస్తూనే ఉన్నామన్నారు. డిసెంబర్ నాటికి  తమ ప్రయత్నాలు ఫలిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  జాతీయ జర్నలిస్టుల సంఘం  కార్యదర్శి  గంట్ల శ్రీనుబాబు, నగర అధ్యక్షులు పోతుమహంతి నారాయణ, బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులు జి.శ్రీనివాసరావుతో పాటు, పలు ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. వీరందరినీ ఘనంగా శ్రీనుబాబు సత్కరించారు.