31న విజ్ఞాన్స్ వర్సీటీకు నోబెల్ గ్రహీత రాక
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు ఈ నెల 31న నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సర్ రిచర్డ్ జే.రాబర్ట్స్ రానున్నారని వర్సిటీ వైస్ చాన్స్లర్ కార్యాలయం మంగళవారం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ విభాగాల ఆధ్వరంలో మూడు రోజుల పాటు జరగనున్న ‘‘ ఫ్రాంటీర్స్ ఇన్ న్యూట్రిషన్, మెడికల్ జీనోమిక్స్ అండ్ డ్రగ్ డిస్కవరీ (ఇన్బిక్స్–22)’’ అనే అంతర్జాతీయ కాన్ఫరెన్స్కు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సర్ రిచర్డ్ జే.రాబర్ట్స్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ కార్యాలయం తెలియజేసింది. ఈయనతో పాటు బెంగళూరులోని ఐఐఎస్సీ మాజీ డైరక్టర్, బైరాక్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ జీ.పద్మనాభన్ కూడా ముఖ్య అతిథిగా రానున్నారని పేర్కొంది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా యూఎస్ఏ–కొలంబస్లోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీ.పీ.ఎస్.వర్మ, హైదరాబాద్లోని సీడీఎఫ్డీ డైరక్టర్ డాక్టర్ కే.తంగరాజ్, మలేసియాలోని యూనివర్సిటీ మలేసియా కేలాంతన్ డైరక్టర్ ప్రొఫెసర్ అవెంగ్ ఏహ్ రాక్, ఫిలిప్పైన్స్లోని ఐఆర్ఆర్ఐ రీసెర్చ్ యూనిట్ లీడర్ డాక్టర్ నిశీ శ్రీనివాసులు, యూఎస్ఏలోని జీనోమిక్స్ ప్రెసిడెంట్, సీఈవో డాక్టర్ రత్నగిరి పోలవరపు, యూఎస్ఏ లోని జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ డాక్టర్ చంద్రశేగరన్, అస్సాంలోని నార్త్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరక్టర్ ప్రొఫెసర్ జీ.నరహరి శాస్త్రి, న్యూఢిల్లీలోని ఎన్ఐపీజీఆర్ సైంటిస్ట్ డాక్టర్ గీతాంజలి యాదవ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ డాక్టర్ చందన బసు వస్తారని వెల్లడించింది. ఇన్బిక్స్–22 అంతర్జాతీయ కాన్ఫరెన్స్కు సంబంధించిన బ్రౌచర్ను విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు మంగళవారం ఆవిష్కరించారు.