డిసెంబర్‌ నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణం ఏపీ సీఎం



డిసెంబర్‌ నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణం ఏపీ సీఎం
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెలరోజుల్లోగా ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభించాలని గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ–క్రాప్‌ జాబితాలను అక్టోబర్‌ 25న సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. డిసెంబర్‌ 21 నాటికి 5లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో 3.5 లక్షలు జగనన్న కాలనీల్లో, 1.5 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దేశించారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌ –3 కింద డిసెంబర్‌లో ఇళ్ల మంజూరు చేయాలని సూచించారు. 

*నెలలో ఆరు సచివాలయాలు తిరగాలి*
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గ్రామ, వార్డు సచివాలయాల్లో కొనసాగుతోందని, ప్రజలనుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనులకోసం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఆలస్యానికి, అలసత్వానికీ తావు ఉండకూడదు అన్నారు. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఈ కార్యక్రమం ద్వారా కవర్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది అందరూ కూడా నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలన్నారు. ఎమ్మెల్యే గ్రామ, మండల స్థాయి సిబ్బందితో కలిసి కనీసం 2 రోజులు పాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో ప్రతి ఇంటిని సందర్శించాలని సూచించారు. ఒక రోజులో కనీసం 6 గంటల పాటు గడప గడపకూ వెళ్లాలన్నారు. ఇప్పటివరకూ వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన పనులను అక్టోబరు 5లోగా మంజూరుచేయాలన్నారు.

*పక్కాగా ఈ–క్రాపింగ్‌*
ఇ– క్రాప్‌ కార్యక్రమంలో చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు ముఖ్యమంత్రి.  ఖరీఫ్ సీజన్‌లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారని.. రైతులను వారి క్షేత్రాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకోవడం, వివరాల నమోదు చేయడం సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలని సూచించారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్వోలు బయోమెట్రిక్‌ ద్వారా వీటిని ఆధీకృతం చేయాలి. అక్టోబరు 3లోగా ఇది పూర్తి చేయాలి. రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తి చేయాలి. అక్టోబరు 10 నుంచి రైతులకు ఇ– క్రాప్‌ డిజిటల్‌ రశీదులు, ఫిజికల్‌ రశీదులు ఇవ్వాలన్నారు. 

*ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం*
గృహనిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, ప.గో, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహనిర్మాణం బాగుందని,, సత్యాసాయి జిల్లా, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు దీనిపై దృష్టిపెట్టాలన్నారు. విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు కేటాయించామని, అక్టోబరు నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణపనులకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు (బోర్‌వెల్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, అప్రోచ్‌ రోడ్లు, సీడీ వర్క్స్, గోడౌన్స్‌) ఇప్పటికే 85శాతం పూర్తయ్యాయని ఇక్కడ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా సంబంధిత కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

*స్పందనలో అధికారులు మానవీయత చూపాలి*
స్పందన అర్జీల్లో సమయ పాలన, నాణ్యత కనిపిస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. అధికారులకు అభినందనలు తెలిపారు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాని పెండింగ్‌ కేసులు, తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకొచ్చారు.  ప్రతి బుధవారం కలెక్టర్లు స్పందనపై సమీక్ష చేయాలన్నారు.  స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలని హితబోధ చేశారు. 

*ఎస్‌డీజీల ఆధారంగానే కలెక్టర్లకు మార్కులు*
ఎస్‌డీజీ లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని.. డేటాను సక్రమంగా అప్‌లోడ్‌ చేస్తేనే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయన్నారు. ఎస్‌డీజీల ఆధారంగానే కలెక్టర్లకు మార్కులు కేటాయిస్తామన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనను మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చూస్తోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

*ప్రతి ఇంట్లో దిశ యాప్ డౌన్ లోడ్ చేయించాలి*
దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలన్నారు. దిశ పనితీరుపై పర్యవేక్షణ చేసేలా కలెక్టర్లు, ఎస్పీలు మాక్‌ కాల్స్‌ చేయాలని సూచించారు.  అవినీతి నిర్మూలనకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నంబర్‌ 14400 పోస్టర్‌ అందరికీ కనిపించేలా ఉండాలన్నారు. ప్రతి యూనివర్శిటీ, కాలేజీలో కూడా ఎస్‌ఈబీ నంబర్‌ 14500 ఉండాలని.. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

*17.05 కోట్ల ఉపాధిహామీ పని దినాలు*
ఉపాధిహామీ కింద ఇప్పటివరకూ 17.05 కోట్ల పనిదినాలను సృష్టించడం అభినందనీయమని సీఎం కొనియాడారు.  ఇప్పటివరకూ సగటు వేతనం రూ.210.02 ఉండగా కనీసం రూ.240 చొప్పున అందేలా కృషి చేయాలన్నారు. కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల ఉపాధిహామీ బకాయిలు త్వరలోనే వస్తాయని..అని రాగానే వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

*అక్టోబర్ 2న రెండో విడత రైతు భరోసా*
రైతు భరోసా రెండో విడత అక్టోబరు 26న విడుదల చేస్తామని, అదే రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా విడుదల అవుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వసతి దీవెన నవంబరు 10న విడుదల చేస్తామని  ప్రకటించారు.