పోలీసుల కష్టం నాకు తెలుసు



పోలీసుల కష్టం నాకు తెలుసు
- సీఎం జగన్

*6,511 పోస్టుల భర్తీతో వీక్లీ ఆఫ్ పక్కాగా అమలు*
*1.33 కోట్ల మహిళల ఫోన్లలో దిశ యాప్*
*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్*

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దేశానికే ఏపీ పోలీసులు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని, పోలీస్ సేవలు అత్యున్నత ప్రమాణాలతో ఉంటున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. సాంకేతిక సాయంతో కీలక కేసులను తక్కువ సమయంలోనే చేధిస్తున్నారని కొనియాడారు. సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్కచేయని మనందరి సైనికుడే మన పోలీసు సోదరుడు అని సీఎం జగన్ కొనియాడారు. మహిళలకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో తీసుకునే సమయం 160 రోజుల నుంచి 42 రోజులకు తగ్గంచి పోలీస్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తోందని తెలిపారు. కేవలం 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను న్యాయస్ధానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నాడు నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంందర్భంగా సీఎం జగన్ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన పోలీస్ వీరులకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రజల కోసం అమర వీరులైన పోలీసులు, త్యాగధనులైన పోలీస్ కుటుంబాలకు ప్రజల తరపున, ప్రభుత్వం తరపున సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. గత ఏడాదిలో విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా 261 మంది పోలీసులు అమరులైతే ఏపీ నుంచి పదకొండు మంది ఉన్నారని ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ కుంటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పోలీసులకు వీక్లీ ఆఫ్ పక్కాగా అమలు చేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకే వీక్లీ ఆఫ్ వ్యవస్థ తెచ్చినట్లు వివరించారు. సిబ్బంది కొరత వల్ల పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు ఇబ్బంది కలగకూడదని పోలీస్‌ శాఖలో 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతామని ప్రటించారు. పోలీస్ సిబ్బంది సమస్యలన్నింటిని తప్పకుండా పరిష్కరిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్నవారి కోసం నేరం జరగక ముందే అక్కడకి చేరుకుని రక్షించిన ఐదుగురు పోలీసుల తరుపున పోలీస్ శాఖకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.


*1.33 కోట్ల మహిళల చేతిలో దిశ యాప్*

మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న తమ ప్రభుత్వం ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోందని సీఎం జగన్ వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు అతి తక్కువ సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మూడున్నరేళ్లలో పోలీస్ వ్యవస్థలో సంస్థాగత మార్పులు తెచ్చినట్లు వివరించారు. దిశా యాప్‌, దిశా పోలీస్‌ స్టేషన్లతో దేశానికే ఆదర్శంగా నిలిచి, మెరుగైన సేవలు అందిండం అందులో భాగమేనన్నారు. ఇప్పటిదాకా 1.33 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు తమ ఫోన్లలో దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటి వరకు 1,237 చోట్ల ఆపద జరగకముందే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఆపద జరిగిన తర్వాత కాకుండా జరగకముందే వాటిని నివారించే పరిస్థితులు తెచ్చినట్లు వివరించారు. అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించామన్నారు. మహిళలు, దళితులను పోలీస్‌ శాఖ రాష్ర్ట హోం మంత్రిగా నియమించి భద్రత ప్రాధాన్యత కోసం వెనకడుగు వేసేది లేదన్న సంకేతాలు రాజకీయాల్లో కొత్త ఒరవడిని తెచ్చినట్లు పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం జగన్ ప్రకటించారు.