ప్రాథమిక పరిశోధనలు చేయాలి

ప్రాథమిక పరిశోధనలు చేయాలి

  నోబెల్‌ గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ 

  నాయకత్వ లక్షణాలు పెరగాలి : బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ  డైరక్టర్, బైరాక్‌ చైర్మన్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ జీ.పద్మనాభన్‌
  విద్యార్థుల్లో ఉత్సుకత పెరగాలి : యూఎస్‌ఏ–కొలంబస్‌లోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డీ.పీ.ఎస్‌.వర్మ
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులు ప్రాథమిక పరిశోధనలను విస్తృతం చేయాలని నోబెల్‌ గ్రహీత సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా వర్చువల్‌ విధానంలో హాజరైన నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మొదటి నుంచే బేసిక్‌ రీసెర్చ్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారిని ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలు కల్పించే ప్రాథమిక పరిశోధనలను చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అందుకు  ఉదాహరణగా తాను యూఎస్‌ఏలోని బోస్టన్‌లో ప్రారంభించిన న్యూ ఇంగ్లాండ్‌ ల్యాబ్స్‌ గురించి తెలియజేసారు. ప్రస్తుతం తన కంపెనీ బిలియన్‌ డాలర్ల కంపెనీగా ఉందని విద్యార్థులకు తెలియజేసారు. మెడికల్‌ జీనోమిక్స్‌ పరిశోధన రంగంలో డ్రగ్‌ డిస్కవరీ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు పరిశోధన సంస్థలతో అనుసంధానం అవడంతో పాటు పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్స్‌ను చదవినట్లైతే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.


నాయకత్వ లక్షణాలు పెరగాలి : బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ  డైరక్టర్, బైరాక్‌ చైర్మన్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ జీ.పద్మనాభన్‌

విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడుతాయని బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ  డైరక్టర్, బైరాక్‌ చైర్మన్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ జీ.పద్మనాభన్‌ అన్నారు. విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధానం ఉండాలని తెలిపారు. కార్పొరేట్‌ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ కోసం ఒకరికొకరు ప్రోత్సాహాన్ని ఇచ్చిపుచ్చుకోవాలన్నారు.

విద్యార్థుల్లో ఉత్సుకత పెరగాలి : యూఎస్‌ఏ–కొలంబస్‌లోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డీ.పీ.ఎస్‌.వర్మ

విద్యార్థుల్లో పరిశోధనల మీద ఉత్సుకత పెరగాలని యూఎస్‌ఏ–కొలంబస్‌లోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డీ.పీ.ఎస్‌.వర్మ అన్నారు. విద్యార్థులు వారి ఆలోచనలను, శక్తియుక్తులను సరైన దిశలో వినియోగించాలన్నారు. పరిశోధనల మీద అభిరుచి ఉన్నవారు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని తెలియజేసారు.

అనంతరం దేశ విదేశాల నుంచి వచ్చిన 700 రీసెర్చ్‌ ఆర్టికల్స్‌ నుంచి ఎంపిక చేసిన  350 రీసెర్చ్‌ ఆర్టికల్స్‌కు సంబంధించిన ఇన్‌బిక్స్‌–22 పరిశోధన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 20 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.