విజ్ఞాన్స్ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్మస్ వేడుకలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని విద్యార్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్లోని స్టూడెంట్ కౌన్సిలర్ గడ్డం సుధీర్ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థులు భయానికి, ఆందోళనకు, ఒత్తిడికు గురికావద్దని పేర్కొన్నారు. కష్టకాలంలో దేవుడిని ప్రార్థించాలని, తొందరపడి క్షణికావేశంలో ఎటువంటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోరాదన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టసుఖాలనేవి సాధారణమని, జీవితంలో చీకటి తర్వాత వెలుగులు కూడా నిండుతాయని తెలియజేసారు. జీవితంలో దేవుడు ఎప్పడు మీకు తోడుగా ఉంటాడని, మిమ్మల్ని సమున్నత స్థానాలకు తీసుకెళ్తాడని తెలియజేసారు. ఏసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసుక్రీస్తు ప్రపంచానికి అందించారన్నారు. ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుందని, సత్యాన్ని మానవాళికి ప్రకటించడంతో శాంతి, సహనాలను ప్రభువు ఎప్పడూ విడిచిపెట్టలేదని చెప్పారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. క్రీస్తు అందించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి, ప్రపంచ శాంతికి సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఏసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన పుట్టుకతోనే సమస్త మానవాళికి రక్షణ వచ్చిందని అన్నారు. ఏసుక్రీస్తు భూమి మీద పుట్టడమే మానవాళి చేసుకున్న గొప్ప భాగ్యమని, క్రీస్తు ప్రతి ఒక్కరి జీవితాలలో జన్మించటమే నిజమైన క్రిస్మస్ అని తెలిపారు. ఏసుక్రీస్తు వారు సమస్త మానవాళి పాపములను క్షమించుట కొరకే ఈ భూమ్మీద నరరూపిగా జన్మించాడని, ఆయన జననం ద్వారా లోకానికి రక్షణ వచ్చిందన్నారు. క్రిస్మస్ పండుగ ఆచారాలకు సంబంధించిన పండుగ కాదన్నారు. ఇది ఆత్మీయతను పెంచే అనిర్వచనీయమైన అనుభవం అన్నారు. క్రీస్తును హృదయంలో కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పరవశమందే సమయమన్నారు. ప్రపంచంలో కొన్ని పండుగలు, కొన్ని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, సంస్కృతులకు మాత్రమే పరిమితమై ఉంటాయన్నారు. క్రిస్మస్ మాత్రం విశ్వవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే పండుగ అన్నారు. మానవులందరికీ శుభాన్ని కలుగజేసే పండుగని తెలియజేసారు. విజ్ఞాన్స్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రేమ, క్షమాగుణం, దయ, కరుణ కలిగి ఉండాలన్నారు. క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. ప్రభువు లోకానికి శాంతి సందేశాన్ని అందించారని తెలిపారు. ప్రజలను రక్షించేందుకు ఆయన మరణం పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రిస్మస్ కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థులు ఆలపించిన క్రిస్మస్ గీతాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. కార్యక్రమంలో విజ్ఞాన్స్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.