విజ్ఞాన్ యూనివర్సిటీలో వైభవంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల్లో గురువారం భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యుద్ధాల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిగా ఏర్పాటు చేసిన అమర్ జవాన్ స్థూపానికి నివాళులర్పించి జ్యోతి వెలిగించారు. విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ, ఎన్సీసీ పరేడ్ ఎంతగానో ఆకర్షించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంగళగిరిలోని కమీషనర్ అప్పీల్స్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పీ.లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకురావాలన్నారు. మహానీయుల త్యాగాల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమైందని, యువత దేశ నాయకులను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. విజ్ఞాన్స్ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనచైతన్య వేదిక ప్రెసిడెంట్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొన్నప్పుడే తమ దేశానికి వారు అసలైన సేవలు అందించనట్లవుతారని యువతను ఉద్దేశించి చెప్పారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ విద్యార్థులు యంగ్ ఇండియాను నిర్మించాలని కోరారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తే సరికొత్త ఆవిష్కరణలను సృష్టించవచ్చునన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి మీరేం చేయగలరో ఆలోచించండని, మనం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందినట్లే అని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జే.మోహనరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.