చిరుధాన్యాలే మానావాళి ఆరోగ్యానికి ఔషధాలు

చిరుధాన్యాలే మానావాళి ఆరోగ్యానికి ఔషధాలు

  ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి
చిరుధాన్యాలను ప్రపంచ మానవాళి ఆహారంగా తీసుకున్నట్లైతే... అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అవి ఔషధాలుగా పనిచేస్తాయని ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘ హెల్త్‌ బెనిఫిట్స్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి మాట్లాడుతూ మానవాళి సంప్రదాయ ఆహార అలవాట్లను పాటించినట్లైతే ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. మీరు తీసుకునే ఆహారాన్ని ఔషధంగా భావించాలన్నారు. చిరుధాన్యాలను ముఖ్య ఆహారంగా తీసుకున్నటైతే మీరు ఏవిధమైన వ్యాధి బారిన పడే అవకాశం ఉండదన్నారు. ఎందుకంటే చిరుధాన్యాల వలన మనకు కావలసిన అన్ని పోషక విలువలు, లవణాలు, తక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయన్నారు. ఇప్పటికే మీరు ఏవిధమైన వ్యాధులతో బాధపడుతన్నట్లైతే.... ఇప్పటినుంచి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే కేవలం 3 నెలలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంవచ్చునని తెలియజేసారు. సంప్రదాయ పద్ధతులు, జీవవన శైలి పద్ధతులు పాటించినట్లైతే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న కీళ్లనొప్పులు, నడుము నొప్పులు, మెడ, భుజము నొప్పుల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చునన్నారు. గడ్డి మొక్కలపైన జరగాల్సిన రీతిలో పరిశోధన చేయకుండా మనం నిర్లక్ష్యం చేశామన్నారు. వీటిపైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు తెలియజేసారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాచీన ఆచార వ్యవహారాలను మన తర్వాత తరం వాళ్లకు అందజేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. అందరూ ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాలనే వినియోగించాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నట్లైతే మన ప్రగతి కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. మంచి ఆహారాన్ని తీసుకుని ఎవరైతే వ్యాయామం కూడా చేస్తారో వారు ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు వారంలో ఒకరోజు చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో గుంటూరులోని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌.రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.