రేపటి నుంచి విజ్ఞాన్ మహోత్సవ్
మూడు రోజుల పాటు అలరించనున్న జాతీయస్థాయి వేడుకలు
సందడి చేయనున్న సినీతారలు
ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థుల రాక
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ప్రతిఏటా విజ్ఞాన్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జీ.వాణీమోహన్ (ఐఏఎస్), గౌరవ అతిథిగా ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ (ఐపీఎస్) హాజరవుతారని వెల్లడించారు. విజ్ఞాన్ మహోత్సవ్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు తరలి రానున్నారని వెల్లడించారు. విజ్ఞాన్ మహోత్సవ పోటీల విజేతలకు విలువైన నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహోత్సవ్లో మొత్తం 82 ఈవెంట్లను నిర్వహిస్తామని వెల్లడించారు. విజ్ఞాన్ మహోత్సవాన్ని ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించడంతో పాటు పారా అథ్లెటిక్స్ పోటీలను కూడా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, వారి సత్తాను పెంపొందించుకునేందుకు విజ్ఞాన్ మహోత్సవ్ ఓ చక్కని వేదిక అని తెలిపారు.
మహోత్సవ్లో సందడి చేయనున్న సినీతారలు
నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన్స్ మహోత్సవ్లో సినీ తారలు సందడి చేయనున్నారు. ఈ నెల 17న విడుదల కాబోతున్న ‘‘ సార్’’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా డైరక్టర్ వెంకీ అట్లూరి, హీరోయిన్ సంయుక్త మీనన్, ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది సందడి చేయనున్నారు. అంతేకాకుండా ‘‘బెదురులంక 2012’’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో కార్తికేయ, హీరోయిన్ నేహాశెట్టి విచ్చేయనున్నారు.
82 ఈవెంట్ల నిర్వహణ
విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహోత్సవ్లో మొత్తం 82 ఈవెంట్లను నిర్వహించనున్నారు. తొలుత నిర్వహించే స్పోర్ట్స్ ఫీట్లో వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, అథ్లెటిక్స్, త్రోబాల్ తదితర క్రీడాంశాల్లో జాతీయస్థాయిలో విద్యార్థులకు పోటీలు ఉంటాయని చెప్పారు. వీటితోపాటు కల్చరల్స్, లిటెరరీ, ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్, మ్యూజిక్, డాన్స్, స్పాట్లైట్, థియేటర్ ఆర్ట్స్ వంటి తదితర రంగాలను కలుపుకుని సాంకేతిక, సాంస్కృతికాంశాల్లో జాతీయస్థాయిలో పోటీలు ఉంటాయని వివరించారు. పారా అథ్లెటిక్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని తెలియజేసారు. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.