దేశాన్ని శక్తివంతం చేయాలంటే యువశక్తితోనే సాధ్యం
- చెన్నైలోని ప్రొపెల్లెర్ టెక్నాలజీస్ ఫౌండర్ సీఈవో, జఫీ రోబోట్స్ కో–ఫౌండర్ ఆషిక్ రహమాన్
దేశాన్ని అభివృద్ధితో పాటు శక్తివంతంగా తయారుచేయాలంటే యువశక్తితోనే సాధ్యమని చెన్నైలోని ప్రొపెల్లెర్ టెక్నాలజీస్ ఫౌండర్ సీఈవో, జఫీ రోబోట్స్ కో–ఫౌండర్ ఆషిక్ రహమాన్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసెల్ ఆధ్వర్యంలో ‘‘ ఇట్స్ మై స్టోరీ’’ అనే ఇతివృత్తంతో సోమవారం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ఆన్లైన్లో ముఖ్య అతిథిగా హాజరైన చెన్నైలోని ప్రొపెల్లెర్ టెక్నాలజీస్ ఫౌండర్ సీఈవో ఆషిక్ రహమాన్ మాట్లాడుతూ కోవిడ్–19 మొదటి వేవ్ సమయంలో కరోనా బాధితులకు సేవలందించేందుకు 100 రోబోలను తయారుచేసి తమిళనాడు ప్రభుత్వానికి అందజేసానని తెలియజేసారు. వీటితో పాటు గడిచిన 6 సంవత్సరాల కాలంలో 250కి పైగా విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులకు రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, డ్రోన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశాలపై విద్యార్థులకు కూలంకషంగా వివరిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులందరూ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలన్నారు. విద్యార్థులు దేశంలో వివిధ రకాల ఎంటర్ప్రెన్యూర్స్ను స్థాపిస్తేనే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, డైరక్టర్లు, విజ్ఞాన్ ఈ–సెల్ విద్యార్థులు పాల్గొన్నారు.