ప్రపంచ దేశాల చూపు మన వైపే
షిబ్పూర్లోని ఐఐఈఎస్టీ డైరక్టర్ ప్రొఫెసర్ పార్థసారథి చక్రబర్తి
ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది : ఏపీ ప్రభుత్వ ఐ అండ్ పీ అడ్వైజర్ రాజీవ్ వైఎస్సార్
ఆలోచనలు ప్రపంచాన్ని శాసిస్తాయి: విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
యువత నడుం బిగించాలి : విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి విజ్ఞాన్ సృజనాంకుర–2కే23
అద్భుత సాంకేతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు
వివిధ రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా హాజరైన విద్యార్థులు
నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇన్నోవేటర్ సుధాన్షు మణి, న్యూఢిల్లీలోని బోట్ల్యాబ్ డైనమిక్స్ ఎండీ డాక్టర్ సరిత అహల్వాత్, నూకాన్ ఏరోస్పేస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ కే సింగ్
వారంతా విద్యార్థులు.. నాలుగు గోడల మధ్య పాఠాలకు పరిమితమయ్యే వారు. కాని వీరు వాటికే పరిమితం కాలేదు. సమాజంలోని సమస్యలు, బాధలే వారికి ఇతి వృత్తాలయ్యాయి. దేశ రక్షణ నుంచి స్థానిక సుపరిపాలన వరకు ఆయా అంశాలను స్పృశించారు. వాటికి నమూనాల రూపంలో జీవం పోశారు. చేబ్రోలు మండలం విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన జాతీయస్థాయి సృజనాంకుర–2కే23 వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు చేసిన సృజనాత్మకతతో కూడిన నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వైజ్ఞానిక కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజ్ఞాన్స్ సృజనాంకుర–2కే23ను వీక్షించారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు మొత్తం మన దేశం వైపే ఉందని షిబ్పూర్లోని ఐఐఈఎస్టీ డైరక్టర్ ప్రొఫెసర్ పార్థసారథి చక్రబర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ జాతీయస్థాయి ‘‘సృజనాంకుర–2కే23’’ కార్యక్రమాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించింది. కార్యక్రమానికి ముఖ అతిథిగా హాజరైన షిబ్పూర్లోని ఐఐఈఎస్టీ డైరక్టర్ ప్రొఫెసర్ పార్థసారథి చక్రబర్తి, గౌరవ అతిథిగా హాజరైన ఏపీ ప్రభుత్వ ఐ అండ్ పీ అడ్వైజర్ రాజీవ్ వైఎస్సార్, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ అతిథిగా హాజరైన షిబ్పూర్లోని ఐఐఈఎస్టీ డైరక్టర్ ప్రొఫెసర్ పార్థసారథి చక్రబర్తి మాట్లాడుతూ ఒక్క మనదేశంలోనే మానవత్వం ఎక్కువగా ఉందన్నారు. కరోనా సమయంలో మన దేశం మన ప్రజలను కాపాడుకుంటూ... ఇతర దేశాలకు కూడా సహాయం అందించి మానవత్వం చాటుకుందన్నారు. విద్యార్థులు నాలెడ్జ్ను ఒకరికొకరు పంచుకుంటేనే కొత్త కొత్త ఐడియాలు పుట్టుకు వచ్చే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సరికొత్త ఇన్నోవేషన్స్ను సృష్టించే విద్యార్థులు వాటిపై పేటెంట్స్ను పొందడం వలన దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.
ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది : ఏపీ ప్రభుత్వ ఐ అండ్ పీ అడ్వైజర్ రాజీవ్ వైఎస్సార్
విద్యార్థులు ఒక్క ఐడియాతో మీ జీవితాన్ని మార్చేసుకోవచ్చని విజ్ఞాన్స్ సృజనాంకుర–2కే23 కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఏపీ ప్రభుత్వ ఐ అండ్ పీ అడ్వైజర్ రాజీవ్ వైఎస్సార్ అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలున్నాయని... వాటిలో ఒక్క సమస్యకు సృజనాత్మకతతో కూడిన పరిష్కారం కనుగొన్నట్లైతే జీవితంలో స్థిరపడిపోవచ్చన్నారు. విద్యార్థులకు తపన ఉంటేæ ఏదైనా సాధించొచ్చునని పేర్కొన్నారు.
ఆలోచనలు ప్రపంచాన్ని శాసిస్తాయి: విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
విద్యార్థులు సరికొత్త ఆలోచనలు, క్రియేటివిటీతో ప్రపంచాన్ని శాసించొచ్చని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు వినూత్నతను చాటుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు సూచించారు. యువత వినూత్న ప్రయోగాలతో ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలుగా మారాలని ఆకాంక్షించారు. ఆలోచనలు ఆచరణలో ఉంచి ప్రయోగాలుగా మార్చి విజయాలను సాధించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే ప్రాజెక్టులను రూపొందిస్తారో వాళ్లలో లైఫ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవడంతో పాటు లీడర్స్గా ఎదుగుతారని పేర్కొన్నారు.
యువత నడుం బిగించాలి : విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
ప్రయోగాల వైపు యువత నడుం బిగించాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ విద్యార్థులకు సూచించారు. తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునన్నారు. విద్యార్థులు తమ సహజ, సమకాలీన ఆలోచనల నుంచి బయటకువచ్చి, కొత్తగా ఆలోచించాలన్నారు. ప్రతి సెకను కాలాన్ని మిగిలినవారికంటే మిన్నగా వినియోగించుకోవాలని, అప్పుడే మనం పోటీ ప్రపంచంలో అందరికంటే ప్రతిభావంతులుగా మారగలుగుతామని ఉద్బోధించారు. నలుగురు అంతకుమించి సమూహాలుగా ఏర్పడి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని తెలిపారు.
నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇన్నోవేటర్ సుధాన్షు మణి, న్యూఢిల్లీలోని బోట్ల్యాబ్ డైనమిక్స్ ఎండీ డాక్టర్ సరిత అహల్వాత్, నూకాన్ ఏరోస్పేస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ కే సింగ్ హాజరవుతారని తెలిపారు.
20వేల మంది విద్యార్థుల హాజరు
జాతీయస్థాయి సాంకేతిక నమూనాల ప్రదర్శన, సాంకేతిక అంశాలపై పోటీలకు సంబంధించిన సృజనాంకుర–2కే23 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు కళాశాలలు, యూనివర్సిటీల నుంచి 20వేల మందికిపైగా విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్ నిరుల, లారా ఇంజినీరింగ్ కళాశాలలు, విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలు భాగస్వామ్యం వహించాయి. జిల్లావ్యాప్తంగా పలు కళాశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు సాంకేతిక నమూనాలను తిలకించేందుకు వచ్చారు.
9 కేటగిరీల్లో పోటీలు ప్రారంభం
విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి సృజనాంకురలో మొత్తం 9 కేటగిరీల్లో పోటీలను ప్రారంభించారు. ఆటోమేషన్, ఇన్ఫ్రా ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫార్మా అండ్ లైఫ్ సెన్సెస్, ఎలక్ట్రానిక్స్, మేనేజ్మెంట్ స్టడీస్, బేసిక్ సైన్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రాజెక్ట్ ఎక్స్పో, టెక్నికల్ పోస్టర్ ప్రజంటేషన్, హ్యాకథాన్, ఐడియాథాన్కు సంబంధించిన విభాగాల్లో కూడా పోటీలు ప్రారంభించారు.
కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, విజ్ఞాన్స్ లారా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్రకుమార్, విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.