విజ్ఞాన్స్ వర్సిటీతో అడివర్స్ టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఐక్యూఏసీతో హైదరాబాద్లోని అడివర్స్ టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వర్సిటీ వైస్ చాన్స్లర్, ఐఐఐటీ అలహాబాద్ మాజీ డైరక్టర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడివర్స్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన ప్లాట్ఫారమ్ను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రారంభించారు. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ అడివర్స్ టెక్నాలజీస్కు యూఎస్ఏలోని వర్జినీయాలో కూడా ఒక బ్రాంచ్ ఉందని తెలియజేసారు. ఈ అవగాహన ఒప్పందం వలన అడివర్స్ టెక్నాలజీస్ సంస్థ విజ్ఞాన్ గ్రూప్ సంస్థల అక్రిడిటేషన్, ర్యాంకింగ్ ప్లాట్ఫారమ్లను ఆటోమేట్ చేయడానికి సహకరిస్తుందన్నారు. అంతేకాకుండా వార్షిక ప్రాతిపదికన సమర్పించే ఏక్యూఆర్ రిపోర్ట్ సమర్పించడంలో విజ్ఞాన్ సంస్థలకు మద్దతు ఇస్తుందన్నారు. ఈ సంస్థ ఐఐక్యూఏ, ఎస్ఎస్ఆర్ ప్రిపరేషన్లోని క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ మెట్రిక్ ప్రిపరేషన్ రెండింటిలోనూ తోడ్పాటునందిస్తుందన్నారు. అడివర్స్ టెక్నాలజీస్కు ఇప్పిటికే ఫ్యాకల్టీ డాష్బోర్డ్, నాక్, ఎన్ఐఆర్ఎఫ్, ఎన్బీఏ వంటి అన్ని ఇండియన్ అక్రిడిటేషన్లను సాధించిందని వెల్లడించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఐక్యూఏసీ సిబ్బంది పాల్గొన్నారు.