భవిష్యత్ కాలమంతా కృతిమ మేథదే!
ఐఎస్ఐ కోలకత్తలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ప్యాట్రన్ రికగ్నిషన్ యూనిట్ ప్రొఫెసర్ ఉమపాద పాల్
విజ్ఞాన్స్లో ఘనంగా ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
రాబోయే భవిష్యత్ కాలమంతా కృతిమ మేథ మీదే ఆధారపడి ఉంటుందని ఐఎస్ఐ కోలకత్తలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ప్యాట్రన్ రికగ్నిషన్ యూనిట్ ప్రొఫెసర్ ఉమపాద పాల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘‘అప్లికేషన్స్ అండ్ అల్గారిథమ్స్ ఆఫ్ కంప్యూటర్ విజన్ అండ్ ప్యాట్రన్ రికగ్నిషన్ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎస్ఐ కోలకత్తలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ప్యాట్రన్ రికగ్నిషన్ యూనిట్ ప్రొఫెసర్ ఉమపాద పాల్ మాట్లాడుతూ మెరుపు వేగంతో ముందుకొస్తున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. నేర్చుకునే యంత్రాలు, నాడీ అనుసంధాన వ్యవస్థలు, సహజ భాషల విభజన, జన్యు అల్గారిథమ్లు, కంప్యుటేషన్ సృజనాత్మకత... ఇలా సాధారణ స్థాయి నుంచి స్వీయ అవగాహన యంత్రాల వరకు కృత్రిమ మేధస్సు నిత్యనూతనంగా మారుతూ వస్తుందన్నారు. టాకింగ్ బోట్, చాట్బోట్, ఇమేజ్, ఫేస్ అండ్ ఎమోషన్ రికగ్నిషన్, ఏఐ ఆధారిత గేమ్స్కు సంబంధించిన కోడింగ్ నైపుణ్యాలు, వాటి తయారీ విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రోబోటిక్స్ సేవలు అత్యంత కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, లా అండ్ ఆర్డర్, షిప్పింగ్, స్పేస్ రీసెర్చ్ టెస్టింగ్లో రోబోటిక్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు. జనరల్ మోటార్స్ తదితర కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలను ప్రారంభించాయన్నారు. కృత్రిమ మేథ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీ ప్రవేశంతో ఉద్యోగాల తీరు మారడంతో పాటు అనేక సవాళ్లు సైతం ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.