జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్

జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
బాపు తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకరు. చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. వారు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్ గారు...జన్మదినం సందర్భంగా వారికి హార్దిక  శుభాకాంక్షలు !

   🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

జయదేవ్ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం అతని కార్టూన్లు.

°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•
    జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్ !
          – కళాసాగర్ యల్లపు
°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•

సెప్టెంబర్ 13న కార్టూనిస్ట్ జయదేవ్ గారి 83 వ జన్మదిన వేడుకల ప్రత్యేక వ్యాసం….

వివరణ అవసరం లేకుండా సూటిగా, సంక్షిప్తంగా, అధ్యయనం పాఠకుడి హృదయానికి హస్తుకునేలా చేసే గొప్ప కళా మాద్యమం కార్టూన్. అందుకే రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాహిత్య, కళా విషయాలతో నిమిత్తం లేకుండా అన్ని రకాల పత్రికలలోనే కాకుండా నేటి సోషల్ మీడియాలోనూ కార్టూన్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంత శక్తివంతమైన కళాప్రక్రియకు తెలుగులో ఆధ్యుడు శ్రీ తలిశెట్టి రామారావు గారైతే, ఆ తర్వాత తెలుగు కార్టూనను విస్తృతపరచడానికి, ఎందరో యువకార్టూనిస్టులు కలం పట్టడానికి కారకులు అయ్యారు బాపు గారు. ఆ తర్వాత చెప్పుకోవలసిన మరో సీనియర్ కార్టూనిస్టు జయదేవ్ గారు. తనకు తెలిసిన కార్టూన్ కళను ఎంతో ఓపిగ్గా తన తర్వాత తరాలకు అందివ్వడానికి కృషిచేసిన, చేస్తున్న వ్యక్తి జయదేవ్ గారు. కార్టూన్ రంగంలో తెలుగు'వాడి'తనం చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన జయదేవ్ గారికి తెలుగునాట వున్నంతమంది ఏకలవ్య శిష్యులు బహుశా తెలుగులో మరొకరికి లేరంటే అతిశయోక్తి కాదేమో.
ఆరు దశాబ్దాల నుంచీ ఆయన 'గీతా'మృత పానం చేస్తూ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. కుంచె వీడని విక్రమార్కుడిలా గత అరవయ్యేళ్ళలో నలభైవేలకు పైగా కార్టూన్లు పండించారు. ఎందుకంటే కార్టూన్లకు ఆయన గీసే గీత గానీ, రాసే రాత గాని అంత పెర్ ఫెక్ట్ గా వుంటాయి. సునిశితమైన కార్టూన్ వేసినా, ఆటంబాంబు లాంటి జోక్ పేల్చినా, సమాజంపై వ్యంగ్యోక్తి విసిరినా, పురాణ పాత్రలపై సెటైర్లు వేసినా ఏదైనా చాలా సూటిగా, సున్నితంగా ప్రేక్షకుడి మానసాన్ని తాకేలా చేస్తుంది. పుంఖాను పుంఖాలుగా వేసిన ఆయన ప్రతీ కార్టూన్‌ను కూడా ఇందుకు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సగటు ప్రేక్షకున్నే కాదు తనతోటి కార్టూనిస్ట్ తో పాటు, అభ్యుదయ కార్టూనిస్టులందరికీ కూడా అంతలా నచ్చే, అందరూ మెచ్చే కార్టూనిస్ట్ జయదేవ్ బాబు.
జీవన ప్రస్థానం:జయదేవ్ గా విఖ్యాతి గడించిన సజ్జా జయదేవ్ బాబు కడపలో 1940 సెప్టెంబర్ 13న జన్మించారు. కానీ పెరిగిందీ, చదివిందీ తన తాతగారి ఇంటివద్ద మద్రాస్ లోనే. లైఫ్ సైన్ లో డాక్టరేట్, పొందిన జయదేవ్ మద్రాస్ సర్ త్యాగరాయ కళాశాలలో బయాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన జయదేవ్ గారికి సంసారభారం మోయాల్సి వచ్చింది. ఒక పక్క ఉమ్మడి సంసార బరువు బాధ్యతలు చూస్తూనే కార్టూనింగ్ ను హాబీగా చేసుకున్నారు. కార్టూనిస్టుగా ఆయన్ను ప్రోత్సహించింది ఆనాటి ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఎడిటర్ శ్రీ శివలెంక రాధాకృష్ణగారు. 19 ఏళ్ళ వయసులో ఆయన తొలి కార్టూన్ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది 1959లో. ఇహ అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కార్టూన్ క్యారెక్టర్లు రూపుదిద్దుకున్నాయి. నాటి విజయ, యువ పత్రికలు మొదలుకొని నేటి స్వాతి, హాస్యపు హరివిల్లు లాంటి పత్రికలతో పాటు గోతెలుగు.కామ్., 64కళలు డాట్ కామ్ లాంటి అంతర్జాల పత్రికలలో ఫేస్ బుక్,
ప్రత్యేకశైలి: జయదేవ్ గారు తన మధ్యతరగతి జీవితంలోని కష్టాలనుంచి, సుఖాలనుంచి, ఆనందాలనుంచి, విషాదాలనుంచి ఎన్నో కార్టూన్లు సృష్టించారు. గీతాల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అని నమ్మి, నిరంతర పరిశీలన, సామాజిక మార్పుల అనుశీలనతో నిత్య నవీనంగా కార్టూన్లు గీస్తున్నారు.
జయదేవ్ గారి మాట ఎంత మృదువో ఆయన గీత అంత పదును. ఆ గీతకు రాసే వ్యాఖ్యలో ఇన్నేళ్ల అనుభవం తొంగిచూస్తుంది. ఇంతటి సాఫ్ట్ మనిషి ఇంత పంచింగ్ గా కార్టూన్లు ఎలా పేల్చగలుగుతున్నారా అని ఆశ్చర్యపోక తప్పదు. తను విభేదించే విషయాలని సైతం ఎంతో నింపాదిగా, నొప్పించకుండా వ్యక్తీకరించటం జయదేవ్ గారి స్పెషాలిటీ. తెలుగువారు గర్వించదగిన మేటి కార్టూనిస్టు పరిమితం చేశారు. అయినా తెలుగువారి వ్యంగ్య వైభవానికి ఆయన కార్టూన్లు నిలువుటద్దాలు. జంతువుల పైన ఎక్కువగా కార్టూన్లు గీసిన వారిలో వీరిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
సాధారణంగా చిత్రకారుడు గీసే రేఖలలో(స్ట్రోక్స్) హెచ్చుతగ్గులు చూపించినపుడు మాత్రమే ఆయా రేఖలు సౌందర్యవంతంగా కనిపిస్తాయి. అలా కాకుండా ఏకరీతిలో సాగే రేఖల్లో  సౌందర్యం అంతగా కానరాదు. కానీ జయదేవ్ రేఖల స్థాయిల్లో అలాంటి వ్యత్యాసం ఏమీలేకుండా ఏకరీతిలో సాగే వారి సన్నటి గీతాల్లో సైతం ఎంతో జీవం కనిపిస్తుంది. డ్రాయింగ్ పై ఆయనకు గల మంచిపట్టు దీనికి కారణమౌతుంది. ఎలాంటి భంగిమనైనా, సన్నివేసాన్నైనా చాలా సింపుల్ గా, చక్కని అమరికతో గీసే కార్టూన్లలో భావయుక్తంగా రాసే వ్యాఖ్యలు చూస్తే ప్రేక్షకుడి మానసాన్ని హత్తుకునేలా చేస్తుంది. తెలుగు కార్టూన్లు స్వర్ణయుగం అనదగిన 1980-1995 మధ్యకాలంలో యువకార్టూనిస్టులెందరో జయదేవ్ బాబుగారి ఏకలవ్య శిష్యులయ్యారు.

• విజయబావుటా...
1997 వరకూ మద్రాసు యూనివర్శిటీలో పి.జి. స్థాయి విద్యార్థులకు జూవాలజీ టీచ్ చేసిన ఆయన తెలుగు పత్రికల్లోనే కాక రీడర్స్ డైజెక్టవంటి జాతీయ పత్రికలోనూ వేలాదిగా కార్టూన్లు గీశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కార్టూను పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిల్లోనే గాక అంతర్జాతీయంగా కూడా కార్టూనిస్ట్ ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచారు. Youmiri simbun (యామిరిసింబన్) Okhotsk లాంటి జపాన్ పత్రికలతో పాటు, ప్రఖ్యాతి గాంచిన Knokkehist (నాకీ హేస్ట్) లాంటి బెల్జియం పత్రికలలో కూడా ఎన్నో కార్టూన్లు జయదేవ్ గారివి ప్రచురింపబడ్డాయి.
అంతేగాక ఆస్ట్రేలియా, అర్జెంటైనా, బ్రెజిల్, బల్గేరియా, ఇటలీ, ఇరాన్, సైప్రాస్, కొరియా, టర్కీ లాంటి దేశాలలో జరిగే అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో జయదేవ్ గారి కార్టూన్లు ప్రదర్శింపబడడమే గాక ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్నారు. 1986లో ఇటలీలో జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్ బాల్ పోటీల సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్టూన్ ప్రదర్శనలే కాక, 1986 నుండి 1996 వరకు వరుసగా ఆయన కార్టూన్లు బెల్జియం దేశంలో ప్రదర్శించబడడం ఎంతో గొప్ప విషయమేగాక 1996లో బెల్జియం లో జరిగిన అంతర్జాతీయ కార్టూన్ పోటీలకు జయదేవ్ గారిని జ్యూరీమెంబర్‌గా గర్వించదగినదిగా ఎంపిక చేసుకున్న తెలుగు.

• యానిమేషన్ రంగంలో …
1997లో ప్రముఖ చిత్రకారుడు, యానిమేషన్ ఎక్స్‌పర్ట్, ఉత్తమ్ జయదేవ్ గారిని హైదరాబాదు కు ఆహ్వానించి హార్ట్ యానిమేషన్ ఎకాడమీకి ప్రిన్సిపాల్ గా నియమించారు. అక్కడ దేశంలోనే ప్రప్రథమ 2డి యానిమేషన్ కోర్స్ మెటీరియల్, అమెరికన్ నిపుణుల సాయంతో రూపొందించడమే గాకుండా, విద్యార్థులకు యానిమేషన్ సూత్రాలను బోదించారు. 2000 సం||లో కలర్ చిప్స్ సంస్థలో చేరి అక్కడ క్రియేటివ్ డైరెక్టర్ గా యానిమేషన్ ఐడియాలను సృష్టించడమే కాకుండా పలు ప్రాజెక్టులను డైరెక్ట్ చేసారు. స్వతహాగా కార్టూనిస్టు కావడంవల్ల ఇది వారికి సులభమైంది.

• అవార్డులు – సత్కారాలు :
ట్రేడ్ ఫేర్ అధారిటీ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ, నిర్వహించిన పోటీలో జయదేవ్ గారి “నోస్మోకింగ్ కార్టూన్” బహుమతి పొందింది. ఢిల్లీకి వీరిని ఆహ్వానించి, TFAI చెయిర్ మన్, మహమ్మద్ యూనస్ గారి ద్వారా బహుమతి అందజేసారు. మరోమారు 'కేర్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ కార్టూన్ కాంటెస్ట్'లో వీరి “వనదేవతశాపం” బొమ్మల కథ బహుమతి పొందింది. అప్పటి కేంద్రమంత్రి శ్రీ కమలనాథ్ గారు సర్టిఫికెట్తోపాటు బహుమతి నందించారు. ప్రముఖ దర్శకుడు వంశీ నిర్మించిన “లేడీస్ టైలర్’ చిత్రం కార్టూన్ ఎడ్వర్ టైజ్ మెంటు పోస్టర్స్ చేసి ప్రశంసలు అందుకుంది. మరో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మించిన మాయలోడు చిత్రం వీరు గీసిన కార్టూన్లు చిత్ర విజయానికి (వారి రాజేంద్రుడు గజేంద్రుడు, ఘటోత్కచుడు చిత్రాలకు కూడా)
దోహదపడింది. ఆ కార్టూన్లతోనే ట్రోఫీలు రూపొందించారు. హైదరాబాదులో జరిగిన ఆ సినిమా వందరోజుల విజయోత్సవ వేడుక వేదిక మీద, వేల సంఖ్యలో ప్రేక్షకుల మధ్య, హాస్యనట శేఖరుడు రాజేంద్రప్రసాద్ ద్వారా ఫీ అందుకోవడం జయదేవ్ గారికి జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. సినిమా ఫీల్డులో కార్టూనిస్టుకు లభించే గుర్తింపు అమోఘం అని ఆరోజు తెలిసిందంటారు జయదేవ్ గారు. ఎన్ని అవార్డులు-సత్కారాలు పొందినా, 2002 సంవత్సరం హైదరాబాదులో మార్చి 11 న ఏ.పి. ప్రెస్ అకాడమీ, ఫోరంఫర్ పొలిటికల్ కార్టూనిస్టులు సంయుక్తంగా నిర్వహించిన కారూ ఉత్సవాల్లో 'శ్రీ బాపూగారి చేతుల నుండి పొందిన సత్కారం, ఆ అనుభూతి వర్ణనాతీతం!' జయదేవ్ గారు అంటారు. బాపు గారే నా గీతాల గురువు అని చెప్పుకొనే జయదేవ్ గారు, బాపు-రమణ అకాడెమీ, హైదరాబాద్ వారి తొలిపురస్కారం జయదేవ్ గారే అందుకోవడం విశేషం.
రచనలు-పుస్తకాలు: వీరి మొదటి కార్టూన్ పుస్తకం 'స్వాతి' పత్రిక వారు ప్రచురించారు. రెండవది 'జయదేవ్ కార్టూన్లు' పేరుతో మీడియా సూస్ వారు 2002లో ప్రచురించారు. 2009లో వీరి జీవిత అనుభవాలను, అనుభూతులను ఆత్మకథగా 'గ్లాచ్యు మీట్యూ' పేరుతో రాసారు. ఇది ప్రతీవారు ముఖ్యంగా సృజనాత్మక రంగంలో నున్న వారు తప్పక చదవదగిన పుస్తకం. ఇంకా అనేక మంది మిత్రుల పుస్తకాలకు కార్టూన్లు, బొమ్మలు అనేకం గీసారు. కుటుంబం:
జయదేవ్ గారికి 1964 లో రాజలక్ష్మి గారితో వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు. 'మాకీ ఒక కొడుకు పుడితే ఇద్దరినీ చాలనుకున్నాం, కానీ మాకు నలుగురు కొడుకులు బహుమానంగా వచ్చారు..! అల్లుళ్ళ రూపంలో' అని చమత్కరిస్తారు జయదేవ్ గారు.

• జయదేవ్ గారితో నా అనుబంధం:
2002 సంవత్సరంలో 'ఆస్కా' సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన 'కార్టూన్ మేళా' ముఖ్య అతిధిగా జయదేవ్ గారిని మేము ఆహ్వానించడం, వారు ఆనాటి సభకు హాజరుకావడంతో మా పరిచయం. తర్వాత రోజుల్లో మేము నిర్వహించిన అనేక కార్యక్రమాలకు వారి తోడ్పాటునందించారు. వారు 'కార్టూన్ మేళా' లో పాల్గొన్న నాటి ఫోటో ఇక్కడ చూడవచ్చు. ఒక్క విజయవాడకే కాదు, ఖమ్మం, నెల్లూరు, హైదరాబాదు, బెంగుళూరు వంటి అనేక ప్రాంతాలకు కార్టూనిస్టులను ప్రోత్సహించారు.
1997లో ఆయన ఉద్యోగ విరమణ చేసిన నాటి నుండి 1999 వరకు అక్కినేని హార్ట్ ఏనిమేషన్‌లో మూడేళ్ళు ప్రిన్సిపాల్ గాను, ఆ తదుపరి 1999 నుండి 2004 వరకు కలర్ చిప్స్ ఇండియా, హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి, మరికొంతకాలం 'జయం' భక్తి మాసపత్రికలకు సంపాదకులుగా భాద్యతలు నిర్వర్తించారు. వరల్డ్ తెలుగు కార్టూనిస్టు వాట్స్ యాప్ గ్రూప్ ద్వారా రెగ్యులర్ గా అనేక కార్టూన్ అసైన్‌మెంట్స్ ఇస్తారు. ఇందులో ఎందరో కార్టూనిస్టులు ఉత్సాహంతో పాల్గొని తమతమ అభిప్రాయాలను పంచుకుంటూ కార్టూన్ కళను పొందుతున్నారు.
ఎనిమిది పదుల వయసులో కూడా ఆయన తన అందమైన కార్టూన్‌లకు కంప్యూటర్ సాయంతో వర్ణాలద్ది మరింత సౌందర్యభరితం చేస్తూ పాఠకులను ఉర్రూతలూగించడమేకాక నేటి యువ కార్టూనిస్టులకు తగు సూచనలిస్తూ నిత్య యవ్వనుడిగా కార్టూన్ కళామతల్లికి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమైనది. కొట్టాది తెలుగు వారికి నవ్వులు పంచుతున్న ఈ జీవి... చిరంజీవి కావాలని, చిరకాలం కార్టూన్ కళామతల్లి సేవలో తరించాలని ఆకాంక్షిస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
– కళాసాగర్ యల్లపు (9885289995)

• ప్రముఖుల...అభిమానుల స్పందన....
• చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని బాపు గారు మొదలు పెట్టారు.జయదేవ్, బాబు గారల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి.

- శివలెంక రాధాకృష్ణ, ఆంధ్ర పత్రిక సంపాదకులు
• అందరూ ఒక కోణంలో అలోచించగలిగితే, జయదేవ్ పలు కోణాల్లో అలోచించగల సామర్థ్యం తన స్వంతం చేసుకున్న వ్యక్తి........అన్ని కార్టూనులూ చూసి అనందించాను. కొన్ని కడుపుబ్బ నవ్విస్తే మరికొన్ని చాలా అలోచింపజేశాయి. ఒక కార్టూనిస్టు ఏ విధంగా ఆలోచించాలో, ఎలా అలోచింపజేయాలో జయదేవ్ తన కార్టూన్ల ద్వారా విపులీకరించారు.
- వంశీ-ప్రముఖ సినీ దర్శకుడు
"జయదేవ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆ శైలే, క్రింద సంతకం చూడనవసరం లేకుండానే తేలికగా పట్టించేస్తుంది......విషయం ఎన్నుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. నిశ్శబ్ద వ్యంగ్య చిత్ర నేర్పరి. "ట్యూబ్‌లైటు" కార్టూన్లలో మరింత పరిశీలిస్తేకాని బుర్రలో లైటు వెలగని గొప్ప కార్టూన్లు వేశారాయన. చిన్న కార్టూన్లలోనే ఆయన చేసే బహు విశాలమైన సన్నివేశ చిత్రీకరణ అద్భుతం...

-రామకృష్ణ - ప్రముఖ కార్టూనిస్ట్
• కార్టూన్ కళలో అంతర్జాతీయ అవగాహన కల్గిన ఆదర్శ కార్టూనిస్ట్ జయదేవ్. తెలుగు కార్టూనిస్టులెందరికో ఆయన మార్గదర్శి గా వున్నారు. నేను విశ్వచిత్రకళ నిర్వహణ సమయంలో కార్టూన్ కళ గురించి ఎన్నో వ్యాసాలు రాసారు. సుప్రసిద్ద మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కి గురువు జయదేవ్ బాబే. వెయ్యి పున్నములు చూసిన ఆయన మరెన్నో పున్నములు చూడాలని, మన కార్టూనిస్ట్ లందరికి మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తూ...
-సుంకర చలపతిరావు, విశాఖపట్నం
• కార్టూను గీతలు హడావిడిగా కాక, శ్రద్ధగా గీసినట్టుండి, అందంగా కనిపిస్తాయి. రాత అచ్చు అక్షరాల్లా ఉంటాయి. సంభాషణరహిత కార్టూన్లు వెయ్యటంలో దిట్ట. హాస్యం అతని కార్టూన్ గమ్యం. సైన్సు విషయాలమీద తెలుగులో కార్టూన్లు వెయ్యగల ఏకైక కార్టూనిస్ట్. మెగతా కార్టూనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో చాలా చొరవ చూపుతారు.
 - బాబు -ప్రముఖ కార్టూనిస్ట్ 
• కార్టూన్లు వేయాలని పత్రికలలో నా కార్టూన్స్ కూడా అచ్చులో చూడాలని అనిపించింది జయదేవ్ గారి కార్టూన్స్ చూసాకే.. అప్పట్లో ఏపత్రిక చూసినా పుంకాలుగా జయదేవ్ కార్టూన్లే ఉండేవి. వాటిని చూస్తే చాలామంది కార్టూనిస్టులు తయారయ్యారని నా అభిప్రాయం. ఇప్పటికీ ఆయన జోరు తగ్గలేదు. అదే స్పీడ్. దశాబ్దాలుగా కార్టూన్స్ వేయడం లో ఆయన ఎక్కడా విరామం తీసుకోలేదు. లెక్కలేనన్ని ఇన్ని వేల కార్టూన్స్ వేసిన కార్టూనిస్టులు ఇండియాలోనే ఉండి ఉంటారు. కార్టూన్ బొమ్మల్లో అప్పటికి, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన శైలి ప్రత్యేకం. ఆయన ఆలోచనలు కాలానుగుణంగా మారుతూ వస్తుంటాయి. ఈ మధ్య ఆయన వేస్తున్న కొన్ని కార్టూన్స్ చూస్తుంటే ఆ విషయం అర్థం అవుతుంది. మనకి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే విషయ పరిజ్ఞానం ఉండాలి. తెలుగు కార్టూనిస్ట్స్ లకు ఆయన గురువు. గురువు గురించి మనం చెప్పేదేముంది. ఆ గురువు శిష్యులను మెచ్చుకునేలా మనం ఎడగాలిగాని. “కార్టూన్ గురూ” కి జన్మదిన  శుభాకాంక్షలు.

-రాజు ఈపూరి, హైదరాబాద్

          🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿