బాలల హక్కులకు భంగం కల్పిస్తే చర్యలు
గుంటూరులోని పోస్కో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ కారుమంచి శ్యామల
విజ్ఞాన్స్లో ఘనంగా ముగిసిన అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్
బాలల హక్కులకు భంగం కల్పిస్తే చర్యలు తప్పవని గుంటూరులోని పోస్కో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ కారుమంచి శ్యామల అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘‘ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్: సమస్యలు – సవాళ్లు ’’ అనే అంశంపై మొట్ట మొదటి అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని పోస్కో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ కారుమంచి శ్యామల మాట్లాడుతూ బాలల హక్కులైన విద్యాహక్కు చట్టం, జీవించే హక్కు గురించి బాలలకు ఉండే ఇతర చట్టాల గురించి, పోలీసులు బాలలకు కల్పించే రక్షణ, మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి, పోక్సో చట్టం గురించి, చట్టంతో విభేదించిన బాలురకు ప్రత్యేక బాలల కోర్టులు, రక్షణ కేంద్రం గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే ఎవరైనా అనాధ పిల్లలుంటే బాలల అభివృద్ధి కమిటీకి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని జువెనైల్ జస్టిస్ డిపార్ట్మెంట్ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ వాసంతి మాట్లాడుతూ హింసకు గురవుతున్న పిల్లలతో తనకున్న అనుభవాలను పంచుకుంది. లైంగిక వేధింపులు, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా వంటి వివిధ మార్గాల్లో పిల్లలు సులభంగా దోపిడీకి గురవుతారని ఆమె తెలిపారు. అందువల్ల వారిని బాల్య గృహాలు, సంస్థలు మరియు చట్టాల ద్వారా రక్షించాలన్నారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఫిర్దోస్ కుతుబ్ వాని, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీఆర్ఏఎఫ్ బోర్డ్ మెంబర్ సరస్వతి రాజు అయ్యర్లు పోక్సో చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.