రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన విజ్ఞాన్స్ విద్యార్థులు
చేబ్రోలు, సెప్టెంబర్ 21 టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ :
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటారని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని రేపల్లెలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ 3వ తైక్వాండో చాంపియన్షిప్లో తమ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు 5 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించారని పేర్కొన్నారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో ఉత్తరప్రదేశ్లోని నాసిక్లో జరగబోయే జాతీయస్థాయి తైక్వాండో చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించారని వెల్లడించారు. అదే విధంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ బాపట్ల జిల్లా నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన చాంపియన్షిప్లో రిథమిక్ యోగా పేయిర్, ఆర్టిస్టిక్ యోగ సోలో, ఆర్టిస్టిక్ యోగా పేయిర్ వంటి విభాగాల్లో తమ విద్యార్థులు పాల్గొని 10 మొదటి స్థానాలు, 3 ద్వితీయ స్థానాలు, 3 తృతీయ స్థానాలు సాధించి సర్టిఫికెట్లను పొందారని వెల్లడించారు. మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులందరూ రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్షిప్ పోటీలకు కూడా అర్హత సాధించారని తెలియజేసారు. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన పీ.వీణ మాధురి ( బయోటెక్, ద్వితీయ సంవత్సరం), వై.గాయత్రి బాల ( సీఎస్ఈ, మూడో సంవత్సరం), ఎండీ ఉస్మాన్ అయాజ్ చిస్ట్ ( ఫుడ్టెక్, నాలుగో సంవత్సరం), ఎమ్.దినేష్ కుమార్ ( ఎంబీఏ, మొదటి సంవత్సరం), ఎస్కే ముజామ్మిల్ ( ఈసీఈ, మొదటి సంవత్సరం)లను వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.