5జీ ల్యాబ్ స్థాపనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఎంపిక
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీను భారత ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మినిస్ట్రీ విభాగం వారు నూతన ఆవిష్కరణలు, పరిశోధనలను మరింత విస్తృతం చేసేందుకు 5జీ ల్యాబ్ స్థాపనకు ఎంపిక చేసిందని భారత ప్రధాని నరేంద్ర మోది శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్–2023 గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోది విజ్ఞాన్స్ యూనివర్సిటీతో పాటు దేశంలోని 100 యూనివర్సిటీల్లో 5జీ ల్యాబ్స్ స్థాపనకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారని వెల్లడించారు. ఆన్లైన్ మోడ్లో జరిగన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రూరల్ అండ్ టెక్నాలజీ డైరక్టర్ రామక్రిష్ణ మాజేటి పర్యవేక్షించారు. ఇన్నోవేషన్లో భాగంగా విద్యార్థుల స్టార్టప్ కమ్యూనిటీస్ను మరింత అభివృద్ధి చేసి నేషన్ బిల్డింగ్ కోసం విజ్ఞాన్స్ యూనివర్సిటీను 5జీ ల్యాబ్ స్థాపనకు ఎంపిక చేసిందని ఆయన వెల్లడించారు. గ్లోబల్ డిజిటల్ గ్రామీణ ప్రాంతాలతో పాటు రిమోట్ ఏరియాలలో 5జీ టెక్నాలజీ వినియోగదారులను పెంచడంతో పాటు అకడమియా – ఇండస్ట్రీలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత అభివృద్ధి చేసి 6జీ టెక్నాలజీకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.