సవాళ్లను అధిగమించి అభివృద్ధి వైపు పయనించాలి
పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ బీఎమ్. పట్నాయక్
విజ్ఞాన్స్లో ఘనంగా అమ్రిత్ కాల్ విమర్ష్ – వికాస్ భారత్–2047 ఉపన్యాస కార్యక్రమం
మన దేశ పురోగతికి ఆటంకం కలిగించే సవాళ్లను అధిగమించి అభివృద్ధి వైపు పయనించాలని పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ బీఎమ్. పట్నాయక్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఏఐసీటీఈ ఏర్పాటు చేసిన ‘‘ ద రోల్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ – ద జర్నీ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ వికాసిత్ భారత్– 2047 / డెవలప్డ్ భారత్ –2047’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ బీఎమ్. పట్నాయక్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం ఆర్థిక వృద్ధి, సామాజిక, సాంకేతిక పురోగతి, స్థిరమైన అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా యువత చురుకుగా పాల్గొనడానికి రోడ్మ్యాప్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి శిక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. సాంకేతికత ఉపయోగించుకోవడానికి పరిశోధన, ఆవిష్కరణలలో పెట్టుబడులను మెరుగుపరచాలన్నారు. ఒక దేశం అవినీతి రహితంగా, అందమైన మనస్సులతో కూడిన దేశంగా మారాలంటే తల్లి, తండ్రి, గురువు అనే ముగ్గురు కీలకమైన సభ్యులతో సమాజంలో మార్పును తీసుకురావచ్చన్నారు. యువతను అవసరమైన సాధనాలు, విజ్ఞానంతో సన్నద్ధం చేయడం ద్వారా వేగంగా మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి వైపు ప్రయాణానికి శక్తివంతం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.