జనవరి 1 నుంచి జాతీయ స్థాయి క్రికెట్ చాంపియన్షిప్ పోటీలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి మహోత్సవ్–2కే24లో భాగంగా జాతీయ స్థాయి క్రికెట్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రికెట్ చాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ క్రికెట్ చాంపియన్షిప్ పోటీలకు యంగ్ ఇండియన్స్ ( వుయ్ కెన్ వుయ్ వెల్) సంస్థ ఈవెంట్ పార్టనర్గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలల్లో డిగ్రీ, పీజీలను అభ్యసించే విద్యార్థులందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చునని తెలియజేసారు. ఒకే కళాశాల నుంచి ఎన్ని జట్లైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని... అయితే ఒక టీమ్లో ఆడిన విద్యార్థి మరో టీమ్లో ఆడటానికి వీల్లేదని వెల్లడించారు. మ్యాచ్లను నాకౌట్ పద్దతిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లకు ప్రశంసా పత్రాలు, మెడల్స్తో పాటు విన్నర్కు రూ. 50,000, రన్నర్కు రూ.30,000, మూడో స్థానంకు రూ.20,000, నాలుగో స్థానంకు రూ.10,000 నగదు బహుమతులను అందజేస్తామని వెల్లడించారు. ఇంకా మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులను కూడా అందజేస్తామన్నారు. క్రికెట్ చాంపియన్షిప్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు www.vignan.ac.in/mahotsav/mcc వెబ్సైట్లో తమ టీమ్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలియజేసారు.