విజ్ఞాన్స్ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉద్భవ్–2కే23’
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ మీట్ ‘ఉద్భవ్–2కే23’ వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్( కీ టు ఆంబీషియస్ అండ్ ఇంటెలెక్చుయల్ జోన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నోవల్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ సౌత్ రిస్క్ హెడ్ ఎస్.సాయి సునీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాయి సునీల్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నింటిలోకి ఎకానమి పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదేనని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో మన దేశం 5 ట్రిలియన్ ఎకానమీ రేటును సాధించి మూడవ అతి పెద్ద ఎకానమీ కలిగిన దేశంగా నిలుస్తామని తెలియజేసారు. ఇదే వృద్ధి ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఆటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ ఫౌండర్ డైరక్టర్ డాక్టర్ డీవీ రమణ మూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరని తెలిపారు. నెట్వర్కింగ్, కొలాబరేషన్, డెసిషన్ మేకింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ వంటి వాటిని విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలన్నారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన టెక్ మహింద్ర హెచ్ఆర్, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి బీ.అఖిల మాట్లాడుతూ విద్యార్థులందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవడంతో పాటు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకోవడం అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని ఇతరులతో పోల్చుకునే అలవాటును మానేయాలన్నారు. జీవితం ప్రారంభంలో సీటీసీ గురించి ఎక్కువ ఆలోచించకుండా వర్క్ మీద ఫోకస్ పెట్టాలన్నారు. వీలైతే సరికొత్త స్టార్టప్స్గానీ, ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగడానికి ప్రయత్నించాలన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ‘ఉద్భవ్–2కే23’లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, మెమోంటోలను అందజేసారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.